తెలంగాణా సీఎం కేసీఆర్ పెట్టబోయే బీఆర్ఎస్ కోసం ఆత్రుతగా ఉందన్న బీజేపీఎంపీ ధర్మపురి అరవింద్
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణ ప్రభుత్వం పై, సీఎం కేసీఆర్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టిఆర్ఎస్ బంద్ చెయ్యి బిఆర్ఎస్ రావాలని తనకు ఆత్రుతగా ఉందని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ పార్టీ ఆదివాసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ధర్మపురి అరవింద్ విమర్శించారు. ఆదివాసీ మహిళ రాష్ట్రపతి కాకుండా టిఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటు వేస్తుందని ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.
ఆదివాసి బిడ్డను రాష్ట్రపతిని చేస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదని అయినా చేస్తున్నామని పేర్కొన్న అరవింద్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అని ప్రకటించి కెసిఆర్ మోసం చేశాడని మండిపడ్డారు. ఇక ఇదే విషయంలో నీ తండ్రి మోసకారి అంటూ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేశారు ధర్మపురి అరవింద్. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో లేకుండా పోయాయని ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. ఆత్మ గౌరవ భవనాలు ఎక్కడికి పోయాయి అని ప్రశ్నించిన అరవింద్ కేసీఆర్ సర్కారు తీరుపై మండిపడ్డారు.
రాష్ట్రపతి ఎన్నికలు కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తుకు తొలిమెట్టుగా మారాయని ధర్మపురి అరవింద్ ఆరోపించారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని కూడా ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కెసిఆర్ బీఆర్ఎస్ ఎక్కడికెళ్ళిందో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో తప్పితే, దేశవ్యాప్తంగా ప్రతి మారుమూల ప్రాంతాల్లోనూ కరెంటు ఉందని ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి భూమి కేటాయించి ఉంటే ఇప్పటికే కోచ్ ఫ్యాక్టరీ పూర్తి అయ్యేదని ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి భూమి కేటాయించలేక పోయిన వీళ్లు, విభజన హామీల గురించి మాట్లాడటం సిగ్గుచేటని ధర్మపురి అరవింద్ విమర్శించారు. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు తెలంగాణ రాష్ట్రానికి వస్తే పర్యాటకులా అంటూ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ దేశం మొత్తం తిరిగితే ఏ పర్యాటకుడునో సమాధానం చెప్పాలని ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ మోడీ, అమిత్ షా ను తీసుకువెళ్లి విచారణ చేయలేదా అంటూ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు.