కేంద్రంలో అలాంటి ప్రభుత్వమే రావాలి: నితీష్తో కలిసి మోడీ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
పాట్నా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని, బీజేపీ ముక్త్ భారత్ కోసం కలిసి పనిచేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. బీహార్ పర్యటన సందర్భంగా సీఎం నితీష్ కుమార్తో కలిసి కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

బీజేపీ ముక్త్ భారత్కు నితీష్ మద్దతంటూ కేసీఆర్
బీజేపీ పాలనలో దేశం తీవ్రంగా నష్టపోయిందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం కలిసి రావాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ను కోరినట్లు తెలిపారు. నీతీశ్ కూడా బీజేపీ ముక్త్ భారత్ కోరుకుంటున్నారని కేసీఆర్ చెప్పారు. ప్రపంచ దేశాల ముందు దేశ పరువు తీస్తున్నారని కేంద్రంపై మండిపడ్డారు.

భారత్ను మార్చే ప్రభుత్వం రావాలన్న కేసీఆర్
రొటీన్ ప్రభుత్వాలు వద్దు.. భారత్ను మార్చే ప్రభుత్వం రావాలన్నారు కేసీఆర్. కేంద్రంలో అబద్ధాలతో పాలన సాగిస్తున్నారు. విపక్షాలను ఏకం చేసే విషయమై నీతీశ్తో చర్చించినట్లు తెలిపారు. మతాలు, కులాలతో విద్వేషాలు సృష్టించే శక్తులు దేశానికి క్షేమకరం కాదని అన్నారు.
చైనాతో పోల్చితే మనం ఎక్కడ ఉన్నామన్నారు. ప్రతిష్ఠాత్మక సంస్థ ఎల్ఐసీని ప్రైవేటీకరణ చేస్తారా? అని ప్రశ్నించారు. రైల్వేలు, ఎయిర్పోర్టులు అన్నీ ప్రైవేటీకరిస్తారా? అని నిలదీశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేశారా? అని ప్రశ్నించారు. దేశ ప్రజలకు కనీసం తాగునీళ్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రధాని మోడీ సర్కార్ ఉందని సీఎం కేసీఆర్ విమర్శించారు.
మోడీ సర్కారును ఇంటికి పంపించే టైమొచ్చిందంటూ కేసీఆర్
బీజేపీ పాలనలో దేశం ఏ రంగంలోనూ అభివృద్ధి సాధించలేదని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశంలోని నదుల్లో 70 వేల టీఎంసీలు అందుబాటులో ఉందని తెలిపారు. ఎనిమిదేళ్ల మోడీ పాలనలో దేశం పూర్తిగా నష్టపోయిందని ముఖ్యమంత్రి ఆరోపించారు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పతనమైందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, పేదలు, మహిళలు ఏ ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని కేసీఆర్ మండిపడ్డారు. ధరలు పెరిగి.. పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
కొత్త కూటమి నాయకత్వం ఎన్నికల నాటికేనంటూ కేసీఆర్
సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని కేంద్రంపై కేసీఆర్ విమర్శలు చేశారు. బేటీ బచావో-బేటీ పఢావో నినాదం ఉన్నా.. అత్యాచారాలు ఆగట్లేదన్నారు కేసీఆర్. దేశాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారని భాజపాను ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం మంచిచేస్తే రైతులు ఎందుకు ఉద్యమిస్తారని కేంద్రాన్ని నిలదీశారు. మేక్ ఇన్ ఇండియా నినాదం పేరుకు మాత్రమేనని.. వస్తువులు ఇతర దేశాల నుంచి దిగుమతి చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు.
బీజేపీ ముక్త్ భారత్ కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ కొత్త కూటమికి ఇప్పుడు నాయకత్వం అవసరం ఏమీలేదని అన్నారు. ఎన్నికల సమయంలోనే నాయకత్వం వహించేది ఎవరని ప్రకటిస్తామన్నారు.












Click it and Unblock the Notifications