టీఆర్ఎస్కు షాక్: పలు పార్టీ నేతలకు బిజెపి వల, అమిత్ షా టూర్ లో చేరికలు
తెలంగాణలో రాష్ట్రంలో పాగా వేసేందుకు బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇతర పార్టీల్లోని అసంతృప్త నాయకులతో బి
హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రంలో పాగా వేసేందుకు బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇతర పార్టీల్లోని అసంతృప్త నాయకులతో బిజెపి నాయకులు చర్చలు సాగిస్తున్నారు.బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటనలో వివిద పార్టీలకు చెందిన కొందరు నేతలు బిజెపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బిజెపి ప్లాన్ చేస్తోంది.ఈ మేరకు ఆ పార్టీ ద్విముఖ వ్యూహాంతో అడుగులు వేస్తోంది. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బిజెపి ప్లాన్ చేస్తోంది.
రాష్ట్రంలోని వివిధ పార్టీల్లోని అసంతృప్త నాయకులతో బిజెపి నాయకులు మంతనాలు జరుపుతున్నారు. తమ పార్టీలో చేరితే భవిష్యత్ ఉంటుందని హామీ ఇస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో పర్యటించే అమిత్ షా పర్యటనలో ఆయనతో ముఖాముఖి కలుసుకొనే ఏర్పాట్లు చేస్తున్నారు.
మరో వైపు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే దిశగా బిజెపి చర్యలను తీసుకొంటుంది.అదే సమయంలో పార్టీని మరింత విస్తరించేందుకు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకొంటుంది.

ద్విముఖ వ్యూహాంతో బిజెపి అడుగులు
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం తక్షణ కర్తవ్యంగా బిజెపి భావిస్తోంది.ఈ మేరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యాచరణను మొదలుపెట్టింది. రాష్ట్రంలో పార్టీ విస్తరణకు అనుకూలమైన వాతావరణం ఉన్పప్పటికీ ఆశించిన మేరకు ఆ పార్టీ దీన్ని ఉపయోగించుకోలేకపోయిందని పార్టీ జాతీయ నాయకత్వం అభిప్రాయపడుతోంది.
ఈ మేరకు జాతీయ నాయకత్వం సూచనల మేరకు విస్తరణ కార్యక్రమాలపై కూడ బిజెపి కేంద్రీకరించింది. ఇతర పార్టీల్లోని అసంతృప్తనాయకులను తమ పార్టీలో చేర్చుకొనే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది.ఈ మేరకు ఇతర పార్టీల నాయకులతో ఆ పార్టీ చర్చలు చేస్తోంది.
అమిత్ షా పర్యటన సందర్భంగా ఆయా పార్టీలకు చెందిన కొందరు నాయకులు బిజెపిలో చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి.

వలసల కోసం కమిటీని ఏర్పాటు చేసిన బిజెపి
ఇతర పార్టీలకు చెందిన అసంతృప్త నేతలతో చర్చించేందుకుగాను బిజెపి ఓ కమిటీని ఏర్పాటు చేసింది.అంతేకాదు ఇతర పార్టీల్లో ఉన్పప్పటికీ బిజెపిలో చేరేందుకు ఆసక్తిని చూపే నాయకుల జాబితాను తయారు చేసి వారితో మంతనాలను చేయనుంది ఈ కమిటీ.
ఆయా పార్టీల నుండి తమ పార్టీలోకి చేరేందుకు నాయకులు చేస్తున్న డిమాండ్లను కేంద్ర నాయకత్వానికి ఈ కమిటీ పంపనుంది.ఈ కమిటీ పంపిన డిమాండ్ల పట్ల కేంద్ర నాయకత్వం సానుకూలంగా స్పందిస్తే వారికి పార్టీలో ప్రవేశం దక్కనుంది.ఈ మేరకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

అమిత్ షా పర్యటనలో చేరికలకు సిద్దం
రాష్ట్రంలోని కాంగ్రెస్, టిడిపి, టిఆర్ఎస్ పార్టీల నుండి తమ పార్టీలో చేరే నాయకులతో ఇప్పటికే బిజెపి నాయకులు చర్చలు సాగిస్తున్నారు.అన్నీ అనుకొన్నట్టుగా జరిగితే ఈ మూడు పార్టీల నుండి జంప్ జిలానీలకు వచ్చే నెలలో బిజెపి తీర్థం తీసుకొనే అవకాశాలున్నాయి.
ఈ మేరకు వచ్చే నెలలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. వచ్చే నెల 23 నుండి 25 వరకు అమిత్ షా పర్యటనలోనే ఆయా పార్టీలకు చెందిన నాయకులు బిజెపి తీర్థం పుచ్చుకొనేలా ప్లాన్ చేశారు ఆ పార్టీ నాయకులు.

రంగారెడ్డి జిల్లా నాయకులు బిజెపిలో చేరేందుకు ఆసక్తి
రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వికారాబాద్ జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రితో పాటు మేడ్చల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేతో బిజెపి నాయకత్వం సంప్రదింపులు జరిపింది.ఈ మేరకు వారు కూడ సానుకూలంగా స్పందించారని సమాచారం. మరో వైపు టిఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న నాయకులతో పాటు కూడ బిజెపి నాయకత్వం చూస్తోంది. అసంతృప్త నేతలను తమ పార్టీలో చేర్చుకొనేందుకు బిజెపి గాలం వేస్తోంది.

అమిత్ షా తో ముఖాముఖి
పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్న నాయకులను బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసేందుకు కూడ బిజెపి నాయకత్వం సంకేతాలను ఇచ్చింది. ఆయా నాయకులను అమిత్ షా తో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్న తర్వాత వారు సంతృప్తి చెందితే పార్టీలో చేర్చుకొనేందుకు బిజెపి సిద్దంగా ఉంది. మరో వైపు బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసేందుకు గాను బిజెపి ప్లాన్ చేస్తోంది.బూత్ స్థాయి కమిటీల సమావేశాల్లో అమిత్ షా పాల్గొంటారు.












Click it and Unblock the Notifications