కొనుగోళ్లు?: వంద కోట్లంటూ టీఆర్ఎస్! కేసీఆర్ చిల్లర రాజకీయాలంటూ బీజేపీ!!
హైదరాబాద్: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ బీజేపీపై టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలు కూడా ఈ ఆరోపణలకు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. భారీగా డబ్బు, కాంట్రాక్టులు ఎరగా చూపి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు.
హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫాంహౌస్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వచ్చిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం చండూరులో సుమన్ మీడియాతో మాట్లాడారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 100 కోట్లు, కాంట్రాక్టులు ఆఫర్ చేశారు. నలుగురు ఎమ్మెల్యేలను కొనాలని బీజేపీ నేతలు ప్రయత్నించడంతో మా ఎమ్మెల్యేలే పోలీసులకు సమాచారమిచ్చారని సుమన్ తెలిపారు. తెలంగాణ సమాజం అమ్ముడు పోయేది కాదని బీజేపీ గ్రహించాలన్నారు.

కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీలో బీజేపీ కుట్రలు చేసిందని ఆరోపించారు బాల్క సుమన్. మునుగోడులో ఓడిపోతామనే బీజేపీ నేతలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బీజేపీ అనేక దుర్మార్గలకు పాల్పడుతోందని మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డిలా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎప్పుడూ చేయరన్నారు. టీఆర్ఎస్ పార్టీని బలహన పర్చేందుకే బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
కేసీఆర్ చిల్లర రాజకీయాలంటూ బీజేపీ నేతలు
బీజేపీపై కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ' కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేయడంలో దిట్ట. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ ట్రాప్ చేసిందంటూ కొత్త నాటకాలకు తెరతీశారు. ఏమిటీ డ్రామా ? కేసీఆర్ చెప్పే కట్టుకథలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో మళ్లీ గెలిచే సత్తా ఎవరికీ లేదు. అయినా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం బీజేపీకి లేదు. ఈ వ్యవహారంతో సంబంధం లేదని చెప్పి యాదగిరి గుట్ట లక్ష్మీ నర్సింహస్వామి దగ్గర కేసీఆర్ ప్రమాణం చేయాలి' అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సవాల్ విసిరారు.
దుష్ట రాజకీయాలన్న ఎంపీ అరవింద్
కేసీఆర్ దుష్ట రాజకీయాలంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.
'మునుగోడు ఉపఎన్నిక తేదీ సమీపించిన ప్రస్తుత తరుణంలో కేసీఆర్, కేటీఆర్ ఆడుతున్న కొత్త నాటకమిది. ఆ తండ్రి,కొడుకులకు ఇలాంటి చెత్త వ్యవహారాలు, దిగజారుడు రాజకీయాలు కొత్తేం కాదు. రాజకీయ మనుగడ కోసం టీఆర్ఎస్ చేస్తున్న దుష్ట రాజకీయాలను, అవాస్తవ ప్రచారాన్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరు' అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.
'ముఖ్యమంత్రి కేసీఆర్ కామెడీ లిమిట్స్ దాటి పోతుంది...
వారి పార్టీ MLAలు, వారి MLA ఫామ్ హౌస్, డబ్బు చూపని Bagలు, బీజేపీ కి నిర్ణయాత్మకమైన ఏమి సంబంధం తెల్వని పెద్దలు..
ఇవి, ఈ రోజు వార్తలు
అన్ని తుగ్లక్ చర్యలే..
ఈ విషయానికి, పోలీసు డిపార్ట్మెంట్కి, లా అండ్ ఆర్డర్ కి ఏమి పరిధి ఉందో, ఏ శాఖకు చెందుతుందో అన్ని అధికారులు చేతిలో పెట్టుకొని ఏ శాఖ పై కూడా కనీస అవగాహన లేని సీఎం కేసీఆర్కి తెలియాలి.
ఇంతకీ మునుగోడు పై ఇంత భయం ఎందుకో, పాగల్ పనులు చేపడుతున్న కేసీఆర్కి తెలియాలి.
ఎయిర్ పోర్ట్ ట్యాగ్ ఉన్న బేగ్ లో పైసలేట్ల ఏల్తాయి?
అవాస్తవానికి ఇది అతి ప్రదర్శన.
ఇన్ని గత్తరబిత్తర మాటలు టీఆర్ఎస్ చెప్పిన,
ప్రజలకు నిజాలు కూడా అర్థం అవుతునే ఉన్నాయి' అని విజయశాంతి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications