Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. తమిళనాడు తరహాలో స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్..

వచ్చే విద్యా సంవత్సరం నుంచి తమిళనాడు అనుసరిస్తున్న తరహాలోనే తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రవేశపెడుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 27 శాతం కలిపి మొత్తం 69 శాతం రిజర్వేషన్లు అమలు చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. తమిళనాడు ప్రభుత్వం చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన విద్యా పునరుజ్జీవన వేడుక కార్యక్రమంలో సీఎం రేవంత్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

" ఇంత మంచి కార్య‌క్ర‌మానికి న‌న్ను ఆహ్వానించినందుకు సంతోషం. అన్నాదొరై, క‌రుణానిధి, కామ‌రాజ్ నాడార్ వంటి గొప్ప యోధుల జ‌న్మ‌స్థ‌లం త‌మిళ‌నాడు. క‌రుణానిధి విజ‌న్‌ను అమ‌లు చేస్తున్న స్టాలిన్, ఉద‌య‌నిధిల‌ను అభినందిస్తున్నా. ఇందిరాగాంధీ కామ‌రాజ్ ప్లాన్‌ ను అనుస‌రించారు. కామ‌రాజ్ త‌మిళ‌నాడులో తీసుకువ‌చ్చిన‌ విద్యా విధానాన్ని దేశం అనుస‌రిస్తోంది. ఈ కార్యక్రమం తమిళనాడు యువతకు ఎంతో స్ఫూర్తి దాయకంగా ఉంటుంది. త‌మిళ‌నాడు అవలంభిస్తున్న సీఎం బ్రేక్‌ ఫాస్ట్ కార్య‌క్ర‌మం హృద‌యాన్ని తాకింది. బ్రేక్‌ ఫాస్ట్‌ తో పేద విద్యార్థుల‌కు ఎంతో మేలు క‌లుగుతుంది. తెలంగాణ‌లోనూ బ్రేక్‌ ఫాస్ట్ ప‌థ‌కాన్ని వ‌చ్చే ఏడాది నుంచి ప్రారంభిస్తాం" అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

"నాన్ ముద‌ల‌వ‌న్ (స్కిల్ డ‌వెల‌ప్‌మెంట్) రూ.10 వేల ఉపకార వేత‌నం ప్ర‌భుత్వ క‌ళాశాల‌ల‌కు వెళ్లే బాలురు, బాలిక‌ల‌కు ఇచ్చే ఈ స్కీమ్‌లు ఉండ‌డం అదృష్టం. త‌మిళ‌నాడు పేద‌ల‌కు అండ‌గా మంచి సీఎం స్టాలిన్ ఉన్నారు. ఎన్నో శతాబ్దాల నుంచి తమిళ, తెలుగు రాష్ట్రాలు, ప్రజల మధ్య సాంస్కృతిక, చారిత్రకపరమైన బలమైన సంబంధం ఉంది. 1991 స‌ర‌ళీక‌ర‌ణ త‌ర్వాత సరళీకృత ఆర్థిక విధానాలతో తమిళనాడులో మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగం అభివృద్ధి చెందింది. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాలు అభివృద్ధి చెందాయి. సామాజిక న్యాయం అమ‌లులో త‌మిళ‌నాడు- తెలంగాణ మ‌ధ్య సారూప్య‌త‌లున్నాయి. మేం క‌రుణానిధిని స్ఫూర్తిగా తీసుకున్నాం. మా రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌రిగే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఓబీసీల‌కు 42 శాతం, 27 శాతం ఎస్సీ, ఎస్టీల‌కు, మొత్తంగా 69 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌బోతున్నాం" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

"భార‌తీయులంతా త‌మిళ‌నాడు విద్యా విధానంతో స్ఫూర్తి పొందారు. దేశంలో మొట్టమొదటగా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించింది తమిళనాడు రాష్ట్రమే. తమిళనాడు అమలు చేస్తున్న విద్యా విధానం మాకు ప్రేరణ కలిగించింది. దక్షిణాదికి చెందిన కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు తమిళనాడు విద్యా విధానం ఆదర్శంగా నిలిచింది. తెలంగాణలో మా ప్రభుత్వం, నేను విద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. విద్యా శాఖ‌ను నా ద‌గ్గ‌రే ఉంచుకున్నా. మా రాష్ట్రంలో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీని ప్రారంభించాం. తెలంగాణ నుంచి ప్ర‌తి ఏటా 1.10 ల‌క్ష‌ల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు క‌ళాశాల‌ల నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నారు" అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

"నైపుణ్య‌లేమితో ఉద్యోగాలు ద‌క్క‌క‌పోతుండ‌డంతో వారి స్కిల్స్ పెంచి ఉద్యోగాలు సాధించేందుకు వీలుగా
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేశాం. పీపీపీ విధానంలో ఈ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేశాం.దానికి ఛైర్మ‌న్‌గా ఆనంద్ మ‌హేంద్ర‌ను నియ‌మించాం. కార్పొరేట్ సంస్థ‌ల అధిప‌తుల‌ను డైరెక్ట‌ర్లుగా నియ‌మించాం. మేం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీని ప్రారంభించాం. ఇక్క‌డ అనేక మంది క్రికెట్‌, టెన్నిస్, ఇత‌ర క్రీడాకారులు ఉన్నారు.మ‌న‌కు 140 కోట్ల మంది ప్ర‌జ‌లు ఉన్నా ఒలింపిక్స్‌లో మ‌న‌కు ఒక్క గోల్డ్ మెడ‌ల్ రాలేదు. 4-5 కోట్ల జ‌నాభా లేని ద‌క్షిణ కొరియాకు 32 గోల్డ్ మెడ‌ల్స్ వ‌చ్చాయి. 30 ఎక‌రాలు ఉన్న ద‌క్షిణ కొరియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ వాళ్ల‌కే 16 గోల్డ్ మెడ‌ల్స్ ద‌క్కాయి. ఒక క్రీడాకారిణికే మూడు అర్చ‌రీ గోల్డ్ మెడ‌ల్స్ వ‌చ్చాయి. మరి మ‌న విజ‌య గాథ ఎక్క‌డ ఉంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర భార‌తంలో మ‌నం ఎక్క‌డ ఉన్నాం. ఒక్క గోల్డ్ మెడ‌ల్ లేదు. 56 అంగుళాల ఛాతీతో ఏం ప్ర‌యోజ‌నం అందుకే నేను యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ ప్రారంభించాం... అందులో సంజ‌య్‌ గోయెంకా, అభిన‌వ్ బింద్రా, కపిల్ దేవ్‌, ఉపాస‌న కొణిదెల వంటి క్రీడాకారులు, కార్పొరేట్ వాళ్ల‌ను తీసుకున్నాం" అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

" స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీతో పాటు స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నాం. త‌మిళ‌నాడు-తెలంగాణ మ‌ధ్య సాంస్కృతిక‌, స్నేహ సంబంధాలు కొన‌సాగాల‌ని కోరుకుంటున్నా. త‌మిళ విద్యార్థులు, కోచ్‌ల‌కు స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీలో అవ‌కాశాలు క‌ల్పిస్తాం.ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడ‌ల్స్ సాధించే బాధ్య‌త తెలంగాణ‌-త‌మిళ‌నాడు తీసుకుంటాయి. మోదీ, అమిత్ షాతో అది సాధ్యం కాదు. గతంలో SC, ST, OBC, మైనారిటీలకు వేర్వేరు పాఠశాలలు ఉండేవి. మేం వారంతా వేర్వ‌ర‌ని అనుకోవ‌డం లేదు. వంద నియోజ‌క‌వ‌ర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను నిర్మిస్తున్నాం. SC, ST, OBC, మైనారిటీ విద్యార్థులంతా ఒకే చోట ఉంటారు. చ‌దువుకుంటారు. ప్ర‌తి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను 25 ఎక‌రాల్లో రూ.200 కోట్ల‌తో నిర్మిస్తున్నాం. 1956లో ప్రారంభించిన ఐటీఐల్లో ఇప్ప‌టికీ అదే సిల‌బ‌స్ కొన‌సాగిస్తున్నారు... ఇప్ప‌టికీ డీజిల్ మెకానిక్‌, ప్లంబ‌ర్ ట్రైనింగ్ ఇస్తున్నారు.. అక్క‌డ శిక్ష‌ణ తీసుకున్న వారికి ఉపాధి ల‌భించ‌డం లేదు. టాటా కంపెనీ భాగ‌స్వామ్యంతో తెలంగాణ‌లో ఐటీఐల‌ను అడ్వాన్సుడ్ టెక్నాల‌జీ సెంట‌ర్లుగా (ATC) అప్‌గ్రేడ్ చేస్తున్నాం. ఇటీవ‌లే మేం నూత‌న విద్యా విధానం తీసుకువ‌చ్చాం.. అందులో భాగంగా ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో వ‌చ్చే ఏడాది నుంచి న‌ర్స‌రీ ప్రారంభిస్తున్నాం" అని సీఎం రేవంత్ అన్నారు.

Breakfast Boost for Telangana Kids Revanth Reddy Adopts TN s Heartwarming Scheme from Next Academic Year

"త‌మిళ‌నాడులో మాదిరే తెలంగాణ‌లో కూడా అనేక ఉన్నత విద్యా సంస్థ‌లున్నాయి. త‌మిళ‌నాడు... తెలంగాణ దేశానికి రోడ్‌మ్యాప్ ఇవ్వ‌నున్నాయి. నాలెడ్జ్ హ‌బ్ కానున్నాయి. త‌మిళ‌నాడు మాదిరే తెలంగాణ కూడా విద్య‌పై చేసే వ్య‌యాన్ని భ‌విష్య‌త్ త‌రాల‌పై పెట్టుబ‌డిగా భావిస్తుంది. కేవలం విద్య మాత్రమే దేశంలో సమానత్వం, సామాజిక న్యాయం, అభివృద్ధి సాధనకు మార్గమని భావిస్తున్నాం. మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదరుడు తిరు స్టాలిన్ గారికి, తమిళనాడు ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. విద్యను విప్ల‌వంగా మేం భావిస్తున్నాం" అని సీఎం రేవంత్ కీలక ప్రసంగంచేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+