'దేవుళ్లకు కోట్ల కానుకలిచ్చే కేసీఆర్కు.. మహిళలకు పెన్షన్ ఇవ్వాలని తెలియదా!'
వ్యక్తిగత విశ్వాసాల కోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని బృందా కారత్ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.
హైదరాబాద్: ఇటీవల తిరుమల వెంకన్నను దర్శించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.5కోట్ల కానుకలు సమర్పించుకుని అన్ని వర్గాల నుంచి విమర్శలు మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సీపీఎం జాతీయ నాయకురాలు బృందా కారత్ దీనిపై స్పందించారు.
వ్యక్తిగత విశ్వాసాల కోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని బృందా కారత్ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. దేవుళ్లకు అత్యంత ఖరీదైన కానుకలిచ్చిన కేసీఆర్కు మహిళలకు పెన్షన్ ఇవ్వాలన్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ లో కూడా మహిళలకు తీరని అన్యాయం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాని మోడీ అనుసరిస్తున్న విధానాలు మహిళల పురోగతికి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసిన మోడీ దేశంలో మద్యపానాన్ని మాత్రం ఎందుకు రద్దు చేయడం లేదని నిలదీశారు. ఆర్ఎస్ఎస్ ను ఈ దేశం ఎన్నడూ జాతీయవాదులుగా గుర్తించదని అన్నారు. మహిళల హక్కుల కోసం అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు.