పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ భవిష్యత్ నిర్దేశం..!!
పార్టీ ఎమ్మెల్యేలకు మాజీ సీఎం..బీఆర్ఎస్ అధినేత దిశా నిర్దేశం చేసారు. ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదని, పార్టీకి తిరిగి మంచిరోజులు వస్తాయని భరోసా ఇచ్చారు. ప్రజలతో మమేకమయ్యేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. పార్టీ నుంచి కొందరు వెళ్లిపోయినంత మాత్రాన ఏదో జరుగుతుందని భయపడాల్సిన పనిలేదని ఆయన వారికి భరోసా ఇచ్చారు. పార్టీ మారిన పోచారం పై పార్టీ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేసారు.
కేసీఆర్ సమావేశం
మాజీ సీఎం కేసీఆర్ ను వరుసగా పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తున్నారు. తాజాగా ఫాం హౌస్ లో మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సమావేశమయ్యారు. మంగళవారం జీహెచ్ఎంసీ పరిధిలోని పార్టీ నేతలతో సమావేశమైన కేసీఆర్..ఈ రోజు మరి కొందరిని కలిసారు. ఆ సమయంలోనే పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేసారు. వారి పైన అనర్హత వేటు వేయాలని కోరారు. జరుగుతున్న పరిణామాల పైన పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ చర్చించారు. దిశా నిర్దేశం చేసారు.

పార్టీకి నష్టం లేదు
కొందరు నాయకులు బీఆర్ఎస్ను వీడినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీ తొలినాళ్ల నుంచి అనేకమంది అనేక విధాలుగా అవమానాలకు, అవహేళనలకు గురిచేసినా బీఆర్ఎస్ ముందుకు సాగిన తీరును వివరించినట్టు సమాచారం. 2004 అనంతరం రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఎదురైన పరిస్థితులు, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలను ఆయన ఉదహరించినట్టు పార్టీ నేతలు తెలిపారు. వైఎస్ హయాంలో ఇలాంటివి ఎన్ని జరిగినా భయపడలేదని వారికి గుర్తుచేసినట్టు తెలిసింది.

పాలన పై ఆగ్రహం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు పైన కేసీఆర్ స్పందించారు. రైతులు, చేనేత కార్మికులు, యువకులు, మహిళలకు ఉపయోగపడే పనులేమైనా జరిగాయా.. కనీసం పింఛన్లు అయినా ఇస్తున్నరా అని ఆయన ఆరా తీశారు. ఆయా నియోజకవర్గాలలో క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పాలనపై దృష్టిపెట్టకుండా సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న ఢిల్లీ టూర్లు, మంత్రుల సమన్వయలోపం వంటి విషయాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది. రోజురోజుకు రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు, నేతన్నల ఆత్మహత్యల ఘటనలపై కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారని పార్టీ నేతలు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications