ప్రధాని మోదీ మౌన ముని: ఆల్ ఈజ్ వెల్ మంత్రం..!!
గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు మోసాలకు పాల్పడిందంటూ హిండెన్ బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ పై సమగ్ర దర్యాప్తు కోసం ప్రతిపక్షాలు పార్లమెంట్ ను స్థంభింపజేస్తోన్నాయి. బీఆర్ఎస్ వారితో గొంతు కలిపింది. జేపీసీ విచారణ
హైదరాబాద్: దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై చెలరేగిన దుమారం.. రోజులు గడుస్తున్నా తగ్గట్లేదు. అదాని సంస్థలన్నింటినీ దాదాపుగా దివాళా తీయించే స్థితికి తీసుకొచ్చిందీ నివేదిక. అదాని ఎంటర్ ప్రైజెస్ ఇదివరకు ప్రకటించిన 20,000 కోట్ల రూపాయల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ ను కూడా రద్దు చేయాల్సి పరిస్థితి వచ్చింది.

100 బిలియన్ డాలర్లకు పైగా..
అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల అధినేత గౌతమ్ అదాని స్వయంగా వివరణ ఇచ్చినప్పటికీ.. ఆ సంస్థల షేర్ల పతనానికి బ్రేకుల పడట్లేదు. ఇవ్వాళ కూడా అదాని షేర్లు భారీగా నష్టపోయాయి. స్టాక్ మార్కెట్లల్లో అదాని ఎంటర్ ప్రైజెస్ షేర్ విలువ భారీగా పడిపోయింది. ఇప్పటికే ఆ కంపెనీ 100 బిలియన్ డాలర్లకుపైగా నష్టపోయింది.

పార్లమెంట్ లో డిమాండ్
హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు పార్లమెంట్ ను స్తంభింపజేస్తోన్నారు. గౌతమ్ అదాని- వేల కోట్ల రూపాయల మేర ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. లోక్ సభ, రాజ్యసభల్లో రోజువారీ కార్యకలాపాలను స్తంభింపజేస్తోన్నారు. కళ్ల ముందే ఇన్ని మోసాలు జరుగుతున్నప్పటికీ- కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందంటూ నిలదీస్తోన్నారు.

మౌనం ఎందుకు..?
ఈ పరిణామాలపై భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. 10 లక్షల కోట్ల రూపాయల మేర గౌతమ్ అదాని మోసానికి పాల్పడితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు పెదవి విప్పట్లేదని ప్రశ్నించారు. ఆయన మౌనంగా ఎందుకు ఉంటోన్నారని నిలదీశారు. అదానీ ఎంటర్ప్రైజెస్ తో పాటు ఆ కంపెనీకి అప్పులు ఇచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీ షేర్ల విలువ భారీగా పడిపోయాయని, ఫలితంగా చిన్న ఇన్వెస్టర్లు నష్టపోయారని అన్నారు.

ఆల్ ఈజ్ వెల్ మంత్రం..
ఇంత జరుగుతున్నప్పటికీ- ఆల్ ఈజ్ వెల్ అంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించడం హాస్యాస్పదమని కవిత ధ్వజమెత్తారు. 10 లక్షల కోట్ల రూపాయల మేర దేశ ప్రజల సంపద హరించుకుపోగా నిర్మల సీతారామన్ ఆల్ ఈజ్ వెల్ అని ఎలా అనగలుగుతున్నారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించాలని, అదాని వ్యవహారంలో ఏం జరుగుతోందనేది దేశ ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.

ప్రధానికి నైతిక బాధ్యత లేదా?
అదానీ వ్యవహారంపై ప్రధాని దేశ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రధాన మోదీపై ఉందని కవిత అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాతే గౌతమ్ అదానీ లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంపదను కూడబెట్టుకున్నారని, ఇప్పుడా కంపెనీల్లో ఆర్థిక మోసాలు జరిగినట్లు హిండెన్ బర్గ్ నివేదిక ఇస్తే- దానిపై స్పందించాల్సిన బాధ్యత లేదా? అని నిలదీశారు.

దేశానికి దిశానిర్దేశం చేసే బడ్జెట్..
కాగా తెలంగాణ బడ్జెట్ పై కవిత మాట్లాడారు. దేశానికి దిశా నిర్దేశం చేసే బడ్జెట్ గా అభివర్ణించారు. 2.90 లక్షల కోట్ల రూపాయలతో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టడం గర్వకారణమని వ్యాఖ్యానించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం ఇచ్చేలా బడ్జెట్ ఉందని కితాబిచ్చారు. మోదీ ప్రభుత్వం గ్రామీణ వ్యవస్థను విస్మరించగా- ఆ లోటును తాము భర్తీ చేసుకున్నామని కవిత పేర్కొన్నారు. .












Click it and Unblock the Notifications