కేసీఆర్ సంచలన నిర్ణయం..
Revanth Reddy: జూన్ 2వ తేదీ అంటే ఆదివారం నాడు దశాబ్ది ఆవిర్భావ దినోత్సవాల కోసం.. తెలంగాణ సర్వ సన్నద్ధమౌతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగే తొలి వేడుకలు ఇవే. దీన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వైభవంగా వ్యవస్థాపక దినోత్సవాలను జరుపుకోవడానికి చర్యలు తీసుకుంది.
ఈ వేడుకలకు హాజరు కావాలంటూ భారత్ రాష్ట్ర సమితి అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ను ఆహ్వానించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు ఇదివరకే కేసీఆర్ను కలుసుకున్నారు. ఆవిర్భావ దినోత్సవాలకు హాజరు కావాలంటూ ప్రభుత్వం తరఫున ఆహ్వానించారు.

ఈ ఉత్సవాల్లో హాజరు కావాలా? వద్దా? అనే విషయంపై బీఆర్ఎస్ తేల్చేసింది. ఈ వేడుకల్లో పాల్గొనకూడదని నిర్ణయించింది. ఈ మేరకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, టాప్ క్యాడర్తో చర్చించిన అనంతరం తన నిర్ణయాన్ని వెల్లడించారు. దీనికి గల కారణాలను వివరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 22 పేజీల లేఖను రాశారు.
ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఉత్సవాల్లో పాల్గొనడం సమంజసం కాదని పార్టీ నాయకులు, ఉద్యమకారులు, తెలంగాణవాదులు అభిప్రాయపడ్డారని ఈ లేఖలో వివరించారు. ప్రజల జీవితాన్ని క్రమ క్రమంగా కల్లోలంలోకి నెట్టుతున్న రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలనతీరును నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇప్పటివరకు ఒక్క రైతును కూడా రేవంత్ రెడ్డి పరామర్శించలేదని కేసీఆర్ ఆరోపించారరు. ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరిని ప్రదర్శించే అఖిలపక్ష సమావేశానికీ తమను ఆహ్వానించలేదని గుర్తు చేశారు. లోగోను మార్చడం అనేది ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి అనుసరించే వ్యూహంగా అభివర్ణించారు.
లోగోలో గల చార్మినార్, కాకతీయ శిలాతోరణం తొలగించాలన్న రేవంత్ రెడ్డి వైఖరి అత్యంత ప్రమాదకరమైనదని, తెలంగాణ సమాజానికి అవమానకరమని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ తల్లికి బదులు పార్టీ నేతల విగ్రహాన్ని సెక్రటేరియట్లో ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాన్ని అవమానించారని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ తీరును ప్రశ్నించే వాళ్లను అడుగడుగునా అవమానిస్తూ దాడులు చేస్తోన్న వైఖరిని, తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచే వికృత పోకడలకు నిరసన తెలియజేస్తోన్నామని కేసీఆర్ వివరించారు. మహాకవి శ్రీశ్రీ కవితను కేసీఆర్ తన లేఖలో ఉటంకించారు. ముందు దగా, వెనుక దగా, కుడిఎడమల దగా దగా అనే వాక్యాలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి పరిపాలనకు ఇవి సరిగ్గా సరిపోతాయని కేసీఆర్ చెప్పారు.












Click it and Unblock the Notifications