రూ.50 వసూలు చేశారని: సుజనా ఫోరంపై కేసు, సుజనా చౌదరి పైనా ఫిర్యాదు
కూకట్పల్లిలోని సుజనా ఫోరమ్ మాల్ పైన పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారని తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారని ఈ కేసు నమోదయింది.
హైదరాబాద్: కూకట్పల్లిలోని సుజనా ఫోరమ్ మాల్ పైన పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారని తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారని ఈ కేసు నమోదయింది.
రేవంత్ రెడ్డికి షాక్: గుట్టువిప్పిన మోత్కుపల్లి, టిఆర్ఎస్తో టిడిపి సై
పార్కింగ్ రూపంలో అదనంగా డబ్బులు
ఏపీ, తెలంగాణ అపార్టుమెంట్ యాక్ట్ 1978 నిబంధనలకు విరుద్ధంగా వినియోగదారులు, సందర్శకుల నుంచి మాల్ నిర్వాహకులు పార్కింగ్ రూపంలో అదనంగా డబ్బులు వసూలు చేయడంపై గత నెల తార్నాకకు చెందిన విజయ్ గోపాల్ అనే వ్యక్తి కెపిహెచ్బి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రూ.50 వసూలు చేశారని
తన కారులో మాల్కు వచ్చానని, తన వద్ద నుంచి నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు రూపంలో రూ.50 వసూలు చేశారని విజయ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. జిహెచ్ఎంసి యాక్ట్ 1955, సెక్షన్ 115 (40) ప్రకారం ఏ స్థలమైనా సందర్శకులను ఆహ్వానించేందుకు నిర్దేశించినప్పుడు, ఆ స్థలం పబ్లిక్ ప్లేస్గా గుర్తింపబడుతుందన్నారు.
పార్కింగ్ స్థలం వదలాలి
ఈ నేపథ్యంలో సందర్శకుల వాహనాలకు పార్కింగ్ స్థలాన్ని వదలాల్సి ఉంటుంది. కమర్షియల్ కాంప్లెక్స్లలో 44 శాతం బిల్డప్ ఏరియాను పార్కింగ్ కోసం కేటాయించాల్సి ఉంటుంది. పార్కింగ్ ఏరియాను లీజుకు ఇవ్వడం, అమ్మడం నిషేధం.
సుజనాపై కేసు నమోదు చేయాలని
ఇలాంటి ప్రదేశాల్లో పార్కింగ్ ఫీజు వసూలు చేయడం చట్ట విరుద్ధమని విజయ్ పేర్కొన్నారు. పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్న నేపథ్యంలో సుజనా చౌదరితో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో సుజనా మాల్ పైన కేసు నమోదయింది.