ఏదీ అసాధ్యం కాదు, మోడీని చూడండి: బాబు, టిడిపిపై నోట్ల రద్దు ఎఫెక్ట్
ఏదీ అసాధ్యం కాదని, 2014 లోకసభ ఎన్నికలలో మెజార్టీ సీట్లు సాధించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేశారని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అన్నారు.
హైదరాబాద్: ఏదీ అసాధ్యం కాదని, 2014 లోకసభ ఎన్నికలలో మెజార్టీ సీట్లు సాధించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేశారని ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ టిడిపి నేతలకు ఉద్బోద చేశారు.
'చంద్రబాబు సింప్లిసిటీ, కేసీఆర్ నేర్చుకోవచ్చు', ఏపీ సీఎంపై జగన్ విమర్శ ఇదే
ఆదివారం నాడు దాదాపు ఎనిమిది తొమ్మిది నెలల తర్వాత చంద్రబాబు తెలంగాణ టిడిపి నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే. తెలంగాణలో టిడిపి పరిస్థితిపై చర్చించారు. ఈ సందర్భంగా మోడీని చూపించి ఏదీ అసాధ్యం కాదని వారికి చెప్పారు.
నెలకు ఒకరోజు
ఇక నుంచి తాను నెలకు ఒకరోజు తెలంగాణ కోసం కేటాయిస్తానని తెలంగాణ టిడిపి నేతలకు హామీ ఇచ్చారు. తొలుత చంద్రబాబు, ఆ తర్వాత నారా లోకేష్ క్రమంగా తెలంగాణ టిడిపికి దూరమైనట్లుగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ టిడిపి నేతల్లో ధైర్యం నూరిపోసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు.
తెలంగాణకు సమయం
తెలంగాణకు కూడా సమయం కేటాయిస్తానని చెప్పారు. తాను ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నందున తెలంగాణకు ఎక్కువ సమయం కేటాయించేందుకు అవకాశం లేదని వారికి చెప్పారు. తెలంగాణలో ప్రజల పక్షాణ పోరాడాలని హితవు పలికారు.
సభ్యత్వంపై షాక్
తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు సభ్యత్వం విషయంలో పెద్ద షాక్ తగిలింది. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి టిడిపి కోటి మందిని సభ్యత్వం తీసుకునేలా చేయాలని భావించింది. కానీ అందులో సగం కూడా కాలేదు. గత ఏడాది కంటే తక్కువ అయింది.
తెలంగాణలో 15 లక్షల టార్గెట్కు 1.76 లక్షలు
తెలంగాణలో 15 లక్షల సభ్యత్వాన్ని టిడిపి టార్గెట్గా పెట్టుకుంది. కానీ పదో వంతు మాత్రమే అయింది. తెలంగాణ టిడిపి మెంబర్ షిప్ ఇంచార్జ్ పెద్దిరెడ్డి మాట్లాడుతూ... 15 లక్షల టార్గెట్కు 1.76 లక్షల సభ్యత్వాలు మాత్రమే అయినట్లు తెలిపారు. సభ్యత్వ నమోదు ఈ నెల 30వ తేదీతో ముగియనుంది.
23 లక్షలని చెప్పిన చంద్రబాబు
అనంతరం చంద్రబాబు తన ఐపాడ్ తీసి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి 23 లక్షల మంది సభ్యత్వ నమోదు తీసుకున్నట్లుగా తెలిపారు. సభ్యత్వ నమోదు పైన నోట్ల రద్దు ప్రభావం పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. నవంబర్ 30 తేదీలోగా సభ్యత్వ నమోదు 33 లక్షలకు చేరుకునే అవకాశముందని చెప్పారు.
గత ఏడాది..
గత ఏడాది 55 రోజుల్లోనే 54 లక్షల మంది తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం నమోదు చేసుకున్నారని గుర్తు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిసి ఇది రికార్డ్ అని చెప్పారు. భారత దేశంలోనే తొలిసారి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు ఇన్సురెన్స్ ఇస్తోందని చెప్పారు.