ఇస్తే ఆ పవర్ ఇవ్వండి.. లేదా డబ్బులు ఇవ్వండి.. కేంద్రంపై కుండబద్దలు కొట్టిన కేసీఆర్
మంగళవారం(ఏప్రిల్ 5) రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతీ అంశంపై కూలంకషంగా మాట్లాడారు. కరోనా లాక్ డౌన్,ధాన్యం కొనుగోళ్లు,వలస కార్మికులు,ప్రతిపక్షాల రాజకీయాలు,కేంద్రం మౌనం వంటి అనేక విషయాలపై తమ వైఖరిని మరోసారి కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ మౌనంపై ఒకింత ఘాటు గానే స్పందించారు. కేంద్రం తప్పుడు విధానాలు అవలంభిస్తోందన్న కేసీఆర్.. భేషజాలకు పోయి కేంద్రం ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. కరోనా కంటే ముందు నుంచే దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదన్నారు. కరోనా కారణంగా మరింత చిన్నాభిన్నం అయ్యే దుస్థితి తలెత్తిందన్నారు.
ఆ అధికారాన్ని రాష్ట్రాలకు బదిలీ చేయండి..
సాధారణంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రతీ నెలా రూ.15వేల కోట్లు రావాలని కేసీఆర్ చెప్పారు.ఇందులో కేంద్రం వాటా పోను రూ.11వేల కోట్లు రావాల్సిన అవసరం ఉందన్నారు. అయితే వచ్చింది మాత్రంకేవలం రూ.1600కోట్లు మాత్రమేనని చెప్పారు. అందుకే ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్లోనూ ఆర్థిక పరిస్థితిపై తాను స్పష్టమైన సూచనలు చేశానన్నారు. ఎఫ్ఆర్బీఎంపై కేంద్రానికి అధికారం ఉంది కాబట్టి.. కేంద్రమే డబ్బులు ఇవ్వాలని,లేదా ఆ అధికారాలను రాష్ట్రాలకైనా బదిలీ చేయాలని తాను కోరినట్టు తెలిపారు. ఆ రుణాలను రాష్ట్రాలే భరిస్తాయని.. కేంద్రం ఒక్క పైసా చెల్లించదని.. అలాంటప్పుడు ఎందుకిలా మౌనం వహిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు.
కదలకుండా మెదలకుండా ఉంటే నడుస్తదా..
కేంద్రం వద్ద కూడా డబ్బు లేదు.. కాబట్టి రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితి లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు అవలంభిస్తున్న విధానాలు అనుసరించాలని సూచించినట్టు కేసీఆర్ తెలిపారు. హెలికాప్టర్ మనీ కాకపోతే ఇంకో విధానం ద్వారా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. కానీ కేంద్రం సంకుచిత మనస్తత్వంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్రం బాధ్యతల్లో ఉన్నవారు ఇలా కదలకుండా.. మెదలకుండా ఉంటే నడుస్తదా అని ప్రశ్నించారు. కేంద్రం ఇలాగే వ్యవహరిస్తే దేశం పెద్ద మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
Recommended Video
ఆ బిల్లును వ్యతిరేకిస్తామన్న కేసీఆర్
ఆఖరికి వలస కార్మికుల నుంచి రైల్వే టికెట్ చార్జీలు వసూలు చేయడం దారుణమన్నారు కేసీఆర్. కేంద్రం వద్ద ఆమాత్రం డబ్బులు లేవా అని ప్రశ్నించారు. వలస కార్మికులను తరలించే డబ్బును తెలంగాణ ప్రభుత్వమే భరిస్తోందని.. ఇప్పటికే రూ.4కోట్లు రైల్వేకు చెల్లించామని అన్నారు. కేంద్రం ఇచ్చిందేమీ లేదని.. ఉల్టా ఆర్బీఐ రూ.2వేల కోట్లు కోత విధించిందని అన్నారు. ఇక కేంద్రం తీసుకురాబోతున్న విద్యుత్ సవరణ ముసాయిదా చట్టాన్ని తాము గట్టిగా వ్యతిరేకిస్తామన్నారు. ఇది సమాఖ్య స్పూర్తికి విఘాతమని.. రాష్ట్రాల హక్కులను హరించడమేనని అభిప్రాయపడ్డారు.ఆ బిల్లును పార్లమెంటులో పాస్ కానివ్వమని స్పష్టం చేశారు. కేంద్రం ధోరణిపై కొద్ది రోజులు వేచి చూస్తామని.. అవసరమైతే నిరసనకు దిగుతామని తెలిపారు.