గ్రేటర్ ఎన్నికలపై చంద్రబాబు సమీక్ష: సోమాజిగూడ కాంగ్రెస్ అభ్యర్థి భర్త అరెస్ట్
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద పార్టీ నేతలు అప్రమత్తంగా వ్వవహరించాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలకు సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఉదయం ఆయన పార్టీ డివిజన్ అధ్యక్షులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ టెలి కాన్ఫరెన్స్లో పార్టీ నేతలకు, కార్యకర్తలకు పలు సూచనలు, సలహాలు చేశారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకోవాలని సూచించారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే స్పందించాల్సిందిగా సూచించారు.
డివిజన్లలో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యేలా చూడాలని సూచించారు. పార్టీ ముఖ్య నాయకులతో పాటు నియోజక వర్గ ఇంఛార్జిలు, కార్యకర్తలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. చివరి ఓటరు ఓటు వేసే వరకు పోలింగ్ బూతులు వదిలి వెళ్లొద్దని కార్యకర్తలు సూచించారు.
రెండు గంటలకు ఒకసారి జీహెచ్ఎంసీ ఎన్నికలపై సమీక్ష చేస్తానని చంద్రబాబు చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 11గంటల వరకు 16.65 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. జూబ్లీహిల్స్లోని బీఎస్ఎన్ఎల్ భవన్ పోలింగ్ కేంద్రంలో ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, బ్రహ్మణి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సోమాజిగూడ కాంగ్రెస్ అభ్యర్థి భర్త అరెస్ట్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సోమాజిగూడ కాంగ్రెస్ అభ్యర్థి భర్త శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీ టోపీలు, కరపత్రాలతో ఆయన పోలింగ్ కేంద్రానికి రావడంతో అక్కడే ఉన్న పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు నేరేడ్ మెట్లో డబ్బులు పంపిణీ చేస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరోవైపు ఎన్నికల్లో ఓటు వేసేందుకు తమకు సెలవు ప్రకటించలేదని కార్మికులు ఉప్పల్ డిపో ఎదుట ఆందోళన చేపట్టారు.