బీఆర్ఎస్ మరో షాక్: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడగా, మరికొందరు త్వరలోనే పార్టీకి గుడ్బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో ఎమ్మెల్యే తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది.
వరుసగా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తుండటంతో వారంతా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ను కలిసిన విషయం తెలిసిందే. తాజాగా, మంగళవారం బీఆర్ఎస్ నేత, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఎమ్మెల్యే కాలే యాదయ్య వెంట.. మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర నేతలు ఉన్నారు. దాదాపు అరంగట పాటు ఈ సమావేశం కొనసాగింది. అయితే, కాలె యాదయ్య సీఎంతో భేటీ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవల పలువురు బీఆర్ఎస్ నాయకులు పార్టీని వీడుతున్న క్రమంలో కాలె యాదయ్య కూడా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇటీవల తీగల కృష్ణారెడ్డి సహా పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. మరోవైపు, బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ రాములు బీజేపీలో చేరారు. మరికొందరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరే అవకాశం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. సీఎం, మంత్రులను కలిసే ముందు తమకు సమాచారం ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినప్పటికీ.. ఆ పార్టీ నేతలు మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అధికార పార్టీ నేతలతో కలుస్తుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications