హైదరాబాద్లో మరో రైల్వేస్టేషన్
హైదరాబాద్ నగరవాసులకు ప్రస్తుతం నాంపల్లితోపాటు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. దేశంలో ఏ ప్రాంతానికి ప్రయాణించాలన్నా ఈ మూడు స్టేషన్ల నుంచి చేరుకోవచ్చు. ప్రతి సంవత్సరం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి 2 నుంచి 3 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అత్యధికి ఆదాయాన్ని ఆర్జించే స్టేషన్ గా నిలిచింది. ఇటువంటి స్టేషన్ తోపాటు నాంపల్లి, కాచిగూడపై రోజురోజుకు ఒత్తిడి ఎక్కువవుతుండటంతో ప్రత్యామ్నాయంగా చర్లపల్లి స్టేషన్ ను కొత్త టెర్మినల్ గా అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే.
రూ.415 కోట్లతో ఆధునికీకరణ
ఇందులో తొమ్మిది ప్లాట్ ఫారాలుంటాయి. రూ.415 కోట్ల వ్యయంతో ఆధునికీకరిస్తున్నారు. ఇక్కడి నుంచి 50 రైళ్లు నడిపేలా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్లపల్లి రైల్వేస్టేషన్ కు సంబంధించి కీలక ఆదేశాలు జారీచేశారు. స్టేషన్ కు చేరుకునే రహదారులను విస్తరించాలని, అలాగే స్టేషన్ పార్కింగ్ సౌకర్యం కోసం అక్కడ ఉన్న అటవీ శాఖ, పరిశ్రమల శాఖ భూములను స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్కడున్న పరిశ్రమలను వేరేచోటకు తరలించాలన్నారు. నాలుగు రోజుల క్రితం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్లపల్లి స్టేషన్ వద్ద రహదారుల విస్తరణకు సహకరించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ కు లేఖ రాశారు. దీనిపై ఆయన స్పందించి ఈ ఆదేశాలు జారీచేశారు.

95 శాతం పనులు పూర్తి
దాదాపు 95 శాతం పనులు పూర్తిచేసుకున్న చర్లపల్లి రైల్వేస్టేషన్ కు చేరుకోవడానికి రహదారులు ప్రధాన అడ్డంకిగా మారాయి. రహదారులన్నీ ఇరుకుగా ఉండటంతోపాటు పార్కింగ్ కోసం ఎటువంటి స్థలం లేకపోవడంతో పనులు ముందుకు సాగడంలేదు. దీనిపై కిషన్ రెడ్డి స్పందించి రేవంత్ కు లేఖ రాశారు. రహదారులను విస్తరించాలంటే ప్రయివేటు ఆస్తులను తీసుకోవాల్సి వస్తోంది. అయితే వాటినివ్వడానికి స్థానికులెవరూ అంగీకరించడంలేదు. ఈ సమస్యను రైల్వేశాఖ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా పరిష్కరిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications