నగరంలో 'దేవుళ్లు' సినిమా సీన్ రిపీట్ (ఫోటో)
హైదరాబాద్: పిల్లలిద్దరూ తల్లిదండ్రుల్ని కలిపిన సంఘటన నగరంలో వెలుగులోకి వచ్చింది. ఆసక్తి కలిగించే ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. వెంకటగిరికి చెందిన కాంట్రాక్టర్ తలారి సత్యంతో రామలక్ష్మి పన్నెండేళ్ల క్రితం వివాహమైంది.
వీరికి పవన్ కార్తీక్ (10), అంజనా సౌమ్య (9) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలం క్రితం గొడవల కారణంగా దంపతుల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. తనను అనుమానిస్తున్న భార్య రామలక్ష్మితో గొడవలు వస్తుండటంతో విసిగిపోయిన సత్యం గత ఏడాది ఆగస్టు 20న భార్య ఇంట్లో లేని సమయంలో ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్లిపోయాడు.
అదే రోజు పిల్లలు కనిపించడం లేదంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు రామలక్ష్మి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎస్ఐ వీరభద్ర కుమార్ వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తన భార్యకు దొరక్కుండా ఉండాలని భావించిన సత్యం ఫోన్ నంబర్లు, చిరునామాలను మార్చారు.
చివరకు మచిలీపట్నంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడే ఉంటూ పిల్లలను స్థానికంగా ఓ పాఠశాలలో చదివిస్తున్నాడు. భర్తను వెతికి పట్టుకొని పిల్లలను తనకు అప్పగించాలంటూ ఏడు నెలలుగా రామలక్ష్మి పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తూ ఉంది. దీంతో వివిధ ప్రాంతాల్లో పోలీసులు వెదుకుతూ వస్తున్నారు.
సత్యం బంధువుల ద్వారా మచిలీపట్నంలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు పిల్లలిద్దరినీ సోమవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. అయితే తాము తండ్రి దగ్గరే ఉంటామని, తల్లి వద్దకు వెళ్లమని తేల్చి చెప్పారు. దీంతో ఆ చిన్నారులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.
తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఉంటే సమాజంలో వచ్చే గుర్తింపు ఎలాంటిదో ఇన్స్పెక్టర్ సామల వెంకట్రెడ్డి వివరించారు. ఆ మాటలతో ఏకీభవించిన చిన్నారులు, తల్లితో వెళ్లాలంటే తండ్రిపై ఆమె పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని కోరారు.
తండ్రిని కూడా ఇంటికి రానివ్వాలని కోరారు. పిల్లల కోరిక మేరకు భర్తతో కలిసి ఉండేందుకు రామలక్ష్మి అంగీకరించింది. భర్తపై అనుమానాలను విడిచిపెట్టి, పిల్లలను చక్కగా చూసుకోవాలని పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహించి ఇంటికి పంపించారు.