ప్రభుత్వ స్థలంలో అక్రమంగా కట్టిన చర్చి కూల్చివేత
హైదరాబాద్: ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన క్రైస్తవ ప్రార్ధనా మందిరాన్ని ప్రభుత్వ అధికారులు కూల్చివేయడంతో క్రైస్తవ సంఘ నాయకులు ఆందోళనకు దిగారు. అబ్దుల్లాపుర్ మెట్ మండలం కమ్మగూడలో గత 10 సంవత్సరాల నుంచి ప్రార్థనలు నిర్వహించుకుంటున్న చర్చిని ప్రభుత్వ అధికారులు కూల్చివేశారు. చివరికి చర్చిలో ఉన్న శిలువను కూడా అధికారులు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా స్థానికులు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులపై దాడులు పెరిగాయని, గత పది సంవత్సరాలుగా ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్న చర్చిని ఎలా కూలగొడతారని వారు ప్రశ్నించారు. ప్రార్థనలు చేసుకుంటున్న మహిళలను దౌర్జన్యంగా బయటకు నెట్టి చర్చిని కూల్చివేసారన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ తమకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని వారు తెలిపారు. తమకు కూల్చివేసిన స్థలంలోనే నూతన చర్చిను నిర్మించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.