క్లియర్: కెసిఆర్ వారసుడు కెటిఆరే, ఇదే నిదర్శనం
కెటిఆర్ను తన వారసుడిగా ప్రకటించేందుకు కెసిఆర్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు అర్థమవుతోంది. కలెక్టర్ల సమావేశం సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటనే ఇందుకు నిదర్శనం.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వారసుడు కెటి రామారావు అనేది స్పష్టంగా తేలిపోయినట్లే. మంత్రి హరీష్ రావు దాన్ని వ్యతిరేకిస్తారనే ప్రతిపక్షాల మాటల్లో ఏ మాత్రం నిజం ఉందో గానీ అవి అంతగా తెలంగాణ రాష్ట్ర సమితిని గానీ కెసిఆర్ను గానీ ప్రభావితం చేసినట్లు లేవు.
కెసిఆర్ నిర్వహించిన కలెక్టర్ల సమావేశం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామం కెటిఆర్కు ప్రమోషన్ ఇవ్వడం దాదాపుగా ఖరారైన విషయాన్ని తెలియజేస్తోంది. 31 జిల్లాల కలెక్టర్లతో కెసిఆర్ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రులు కలెక్టర్ల సమావేశాలు నిర్వహించడం మామూలు విషయమే.
కానీ, ఆ సమావేశానికి వచ్చిన జిల్లా కలెక్టర్లు కెటి రామారావుతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. నిజానికి, కెసిఆర్ తనయుడు కాకుండా ఉంటే అందరు మంత్రుల మాదిరిగానే ఆయన కూడా ఓ మంత్రి. పైగా, ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులున్నారు. ఓ డిప్యూటీ ముఖ్యమంత్రి మహమూద్ అలీ రెవెన్యూ శాఖను నిర్వహిస్తున్నారు.
అయితే, గియితే జిల్లా కలెక్టర్లు ఆ డిప్యూటీ ముఖ్యమంత్రితో గ్రూప్ ఫొటో దిగాలి. అలా కాకుండా కెటిఆర్తో గ్రూప్ ఫొటో దిగడమంటే ఆయనకు ప్రమోషన్ ఖాయమనే చెప్పక తప్పదు. కెసిఆర్ కెటిఆర్ను తన వారసుడిగా నిలబెట్టడానికి కచ్చితమైన నిర్ణయం తీసుకుంటే తప్ప అలా జరగదు. కెటిఆర్తో జిల్లా కలెక్టర్లు దిగిన గ్రూప్ ఫొటో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధికారిక పత్రిక నమస్తే తెలంగాణలోనే కాకుండా మరికొన్ని పత్రికల్లో కూడా అచ్చయింది.