'సీఎల్పీతో పాటు అన్ని పదవులకూ రాజీనామా..!' ఎందుకు నాకీ పదవులు..? : జానారెడ్డి
హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలంతా వరుసపెట్టి అధికార పార్టీలోకి క్యూ కట్టడంతో.. పార్టీలో కలకలం రేగుతోంది. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే గుత్తా భాస్కరరావు, మాజీ ఎంపీ వినోద్, మాజీ ఎమ్మెల్యే వినోద్ కారెక్కడానికి సిద్దమవడంతో రాష్ట్ర కాంగ్రెస్ అంతర్మథనంలో పడింది. ఇదిలా ఉండగానే నల్గొండ డీసీసీ చీఫ్ రాంరెడ్డి కూడా కాంగ్రెస్ ని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించేశారు.
కాంగ్రెస్ కి షాక్ ల మీద షాక్ లు తగులుతున్న క్రమంలో.. కాంగ్రెస్ సీఎల్పీ నేత జానారెడ్డి తన పదవులకు రాజీనామా చేస్తానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేతల ఫిరాయింపుల నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన సీఎల్పీ నేత జానారెడ్డి ఈ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. సీఎల్పీతో పాటు మిగతా అన్ని పదవులకు రాజీనామా చేయాలనుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు.
ఇదిలా ఉంటే తన తాజా నిర్ణయం వెనుక కారణాల గురించి వివరణ ఇచ్చారు జానారెడ్డి. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు తనను తీవ్ర ఆవేదనకు లోను చేశాయని చెప్పుకొచ్చిన జానారెడ్డి, అధికార టీఆర్ఎస్ తీరు తనను తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాజా ఫిరాయింపుల నేపథ్యంలో ఈ పదవుల్లో కొనసాగడం అవసరమా..?, ఎందుకు నాకీ పదవులు..? అనిపించినందువల్లే ఫిరాయింపులకు వ్యతిరేకంగా పదవులన్నింటిని త్యాగం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలియజేశారు.
రాజీనామాపై తుది నిర్ణయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో చర్చించాక వెల్లడిస్తామని ప్రకటించారు. ఇక పదవుల గురించి ప్రస్తావిస్తూ.. 'ఇంతకంటే పెద్ద పదవులపై తనకు ఆశ లేదని, ఒకవేళ ఇస్తానన్నా..! ఆ పదవులు తనకు అవసరం లేదని' తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు సోనియా గాంధీకి ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటానని తెలిపారు.
ఇక రాష్ట్రంలో పరిస్థితులపై.. ముఖ్యంగా అధికార పార్టీ బంగారు తెలంగాణ నినాదం గురించి ప్రస్తావించిన జానారెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణ మేథావులు, ప్రజలు, సీఎం కేసీఆర్.. అందరూ ఒక్క విషయం మీద దృష్టి పెట్టాలి. బంగారు తెలంగాణ ఫిరాయింపులతోనే సాధ్యమవుతుందా..? ఇదేనా బంగారు తెలంగాణ..' అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఫిరాయింపులతో వచ్చేది బంగారు తెలంగాణ కాదని, భ్రష్ట తెలంగాణ అని ఎద్దేవా చేశారు. ఇలా సామాజిక, ప్రజాస్వామిక తీరు కొరవడిన తెలంగాణ రాష్ట్రాన్ని మనమెప్పుడైనా కోరుకున్నామా..? అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇక పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న వారు రాజీనామా ద్వారా తమ నైతికతను నిరూపించుకోవాలని సూచించారు. సీఎం పదవిని ఆఫర్ చేసినా.. తెలంగాణ కోసం తాను పదవిని వదులుకున్నానని తెలిపారు.
టీఆర్ఎస్ అనైతిక రాజకీయాలకు పాల్పడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, తక్షణం ఫిరాయింపు చట్టాన్ని సవరించాల్సిన అవసరముందన్నారు.