లోకేష్ తో జతకట్టాక : ఆ విషయంలో కేసీఆర్ కు తిరుగులేకుండా పోయింది..
హైదరాబాద్ : ఉద్యమనేతగా తెలంగాణ కలను నెరవేర్చడంలో కేసీఆర్ ఎంత మొండివాడిగా పేరు తెచ్చుకున్నారో.. తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక పాలనకు సంబంధించిన ప్రతి అంశంలొను లోతైన అధ్యయనానికి పెద్దపీట వేస్తున్నారు.
సహజంగానే రాజకీయ పరిణితి కలిగిన సీఎం కేసీఆర్, రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను లెక్కలతో సహా ఎలాంటి నోట్ పేపర్ అవసరం లేకుండా చెప్పడంలో ధిట్ట. రాష్ట్ర సామాజిక, భౌగోళిక, ఆర్థిక స్థితిగతులపై ఆయనకున్న పట్టు అలాంటిది. అయితే ఆ పట్టును సాధించడం వెనుక ఆయన చేసిన క్రుషి చాలానే ఉంది.
అందులో మచ్చుకు లోకేష్ వ్యవహారం ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది. ఎక్కడో యాపిల్ సంస్థలో సిస్టం మేనేజర్ గా పనిచేస్తున్న లోకేష్ ని తీసుకొచ్చి సీఎం కేసీఆర్ తన దగ్గర చేర్చుకున్నారు. ముందునుంచే సాగునీటి పారుదల విషయంలో సాంకేతికతను మరింతగా ఉపయోగించుకోవాలని భావిస్తున్న ఆయన టీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత లోకేష్ తో యాపిల్ సంస్థకు రాజీనామా చేయించి సాంకేతిక వ్యవహారాల నిపుణుడిగా నియమించుకున్నారు.
అంతకుముందే లోకేష్ సలహాలు సూచనలతో గూగుల్ మ్యాప్స్ పై అవగాహన పెంచుకున్న సీఎం, 2010 నుంచే తను ఉపయోగిస్తున్న ఐపాడ్ ద్వారా గూగుల్ ఎర్త్ సహాయంతో గోదావరి, కృష్ణా నదుల ప్రవాహం, ఆ నదులపై నిర్మించిన ప్రాజెక్టులు, ఎత్తిపోతలపై సమగ్ర సమాచారాన్ని సేకరించి అన్నింటిని క్షుణ్ణంగా విశ్లేషించుకునే ప్రయత్నం చేసేవారు.
ఆవిధంగా సాంకేతికతను ఉపయోగించుకుని రాష్ట్ర ప్రాజెక్టులపై తనకున్న పరిజ్ఞానానికి మరింత పదును పెట్టారు కేసీఆర్. ఇకపోతే లోకేష్ పూర్తి పేరు పందెం లోకేశ్వర్రెడ్డి. మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట లోకేష్ స్వస్థలం. ఎల్.ఎల్.బీ చదివిన లోకేష్ యాపిల్ సంస్థలో కొన్నేళ్ల పాటు సిస్టమ్స్ మేనేజర్ గా పనిచేశారు.
2009లో మొదటిసారి సీఎం కేసీఆర్ ని కలిసిన లోకేష్ రాష్ట్రం పట్ల తనకున్న ఆలోచనలను కేసీఆర్ తో పంచుకున్నారు. అప్పటినుంచి లోకేష్ సాంకేతికత సలహాలతో ప్రాజెక్టులపై మరింతగా ఫోకస్ చేసిన కేసీఆర్ లోకేష్ ను తనవద్దే సాంకేతిక నిపుణుడిగా నియమించుకుని ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు.