కల్వకుంట్ల కుటుంబం నుంచి మరొకరు - కీలక బాధ్యతలు..!!
ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ విస్తరణ వేగవంతం చేసారు. మహారాష్ట్రలో పార్టీ నిర్మాణం దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా తన అన్న కల్వకుంట్ల రంగారావు కుమారుడు కల్వకుంట్ల వంశీధర్రావు వంతు వచ్చింది. ఆయనను మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్చార్జిగా అధినేత కేసీఆర్ నియమించారు. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ కమిటీల నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది.
బీఆర్ఎస్ లో క్రియాశీలకంగా: కల్వకుంట్ల కుటుంబం నుంచి మరొకరు బీఆర్ఎస్ లో క్రియాశీలకంగా మారారు. కల్వకుంట్ల వంశీధర్రావు కు సీఎం కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. మహారాష్ట్ర బాధ్యతలు కేటాయించారు. గతంలో చిరంజీవి అభిమానిగా ఉన్న వంశీధర్రావు 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.

అనంతరం చాలాకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న వంశీధర్.. ఇటీవల కొంతకాలంగా బాబాయి కేసీఆర్కు దగ్గరగా మెలగుతున్నారు. దీంతో ఆయనకు మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్చార్జిగా కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. కల్వకుంట్ల రంగారావుకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వీరిలో ఒకరు వంశీధర్రావు కాగా, మరో కుమారుడు కల్వకుంట్ల కన్నారావు రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్గా లేరు.
మహారాష్ట్ర బాధ్యతలు: రంగారావు కూతురు రమ్యారావు మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. రంగారావు ఫౌండేషన్ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వంశీధర్రావు సిద్దిపేట నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం ఇటీవల జరిగింది. కానీ, ఆయన అనూహ్యంగా మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్చార్జిగా నియమితులయ్యారు.
మహారాష్ట్ర బీఆర్ఎస్ కు ఇన్చార్జితోపాటు 15 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీని అధినేత కేసీఆర్ నియమించినట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ తెలిపారు. కమిటీ చైర్మన్గా కేసీఆర్ వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ కమిటీల నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది.
విస్తరణలో భాగంగా: మహారాష్ట్రలో బీఆర్ఎస్ గ్రామస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీల నిర్మాణం దాదాపు కొలిక్కి వచ్చింది. పార్టీ నిర్మాణంతోపాటు ప్రజల మనోగతాన్ని తెలుసుకోవటం, నియోజకవర్గాలవారీగా సమస్యలు గుర్తించి, వాటి పరిష్కారానికి కార్యాచరణను రూపొందించటం వంటి కీలక అంశాలపై పార్టీకి దిశానిర్దేశం చేసేందుకు స్టీరింగ్ కమిటీ ఏర్పాటైంది.
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ ఈ మేరకు శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీచేశారు. స్టీరింగ్ కమిటీతోపాటు ఇప్పటికే ప్రకటించిన ఆరు డివిజన్ కమిటీ సమన్వయకర్తలకు, సహాయకులుగా ఉండేందుకు సహాయ సమన్వయకర్తలను నియమించారు. రెండు మూడురోజుల్లో 36 జిల్లాలకు పార్టీ సమన్వయకర్తలను, సహాయ సమన్వయకర్తలను నియమించే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications