కెసిఆర్ కొత్త క్యాంప్ కార్యాలయం ఖర్చు రూ.35 కోట్లు, వాస్తు చూశాకే..
హైదరాబాద్: బేగంపేటలోని సిఎం క్యాంప్ కార్యాలయం సరిపోవడం లేదు. దీంతో కొత్త క్యాంప్ కార్యాలయం నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. సిఎం కెసిఆర్ కొత్త క్యాంప్ కార్యాలయానికి రూ.35 కోట్లు ఖర్చు కానున్నాయని అంచనా వేశారు.
ఈ నిర్మాణం త్వరలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. వచ్చే దసరా పర్వదినం నాటికి కొత్త భవనంలోకి (క్యాంప్ కార్యాలయం) మారలని కెసిఆర్ భావిస్తున్నారు. ఈ కొత్త భవనంలో 250 మంది కూర్చునేలా ఆడిటోరియం, 300 వాహనాలు పార్క్ చేసేలా పార్కింగ్ సదుపాయం ఉండనుంది.
ఈ మేరకు సీఎం కెసిఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ కొత్త భవనం మొత్తం 9 ఎకరాలలో నిర్మిస్తారు. ప్రస్తుతం ఉన్న కార్యాలయంకు ఆనుకొని దీనిని నిర్మించనున్నారు. ఈ భవనానికి సంబంధించి వాస్తు నిపుణులు సుద్దాల అశోక్ తేజ చూశారు.
వాస్తు అన్నీ చూశాక ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ భవనం డిజైన్కు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఉన్న క్యాంప్ కార్యాలయం శాసన సభ స్పీకర్, శాసన మండలి చైర్మన్లకు కేటాయిస్తారు. సీఎం క్యాంప్ కార్యాలయం నిమిత్తం ప్రభుత్వం ఇప్పటికే ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ భూమిని తీసుకుంది.
ఐఏఎస్ల కోసం స్టేట్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ దగ్గర ప్రభుత్వం కొత్త క్లబ్ హౌస్ నిర్మించనుంది. ఇది ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎదురుగా ఉంది.
కొత్త సీఎం క్యాంప్ కార్యాలయాన్ని దసరా వరకు పూర్తి చేయాలని, దీని కోసం టెండర్లు పిలవాలనుకుంటున్నామని, ఈ నిర్మాణానికి రూ.35 కోట్లు ఖర్చు కానుందని అధికారులు చెప్పారంటున్నారు.
మొత్తం తొమ్మిది ఎకరాల్లో.. రెండు ఎకరాల్లో సీఎం ఇల్లు కమ్ ఆఫీస్ క్వార్టర్స్ ఉండనున్నాయి. మిగతా ఏడు ఎకరాల్లో 250 మంది కూర్చునేలా ఆడిటోరియం, 100 మంది కూర్చునే కాన్ఫరెన్స్ హాల్, సీఎం పర్సనల్, సెక్యూరిటీ స్టాఫ్కు క్వార్టర్లు, పార్కింగ్ సదుపాయాల నిర్మాణాలు ఉంటాయి.
ఇప్పుడున్న క్యాంప్ కార్యాలయాన్ని 2005లో వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిర్మించారు. దీని ఖర్చు అప్పుడు రూ.10 కోట్లు. ఇది ఒకటిన్నర ఎకరాల్లో ఉంది. మరో రూ.10 కోట్లు వాస్తు మార్పుల కోసం, సెక్యూరిటీ ఖర్చుల కోసం ఉపయోగించారు.
వైయస్ తర్వాత ఇదే క్యాంప్ కార్యాలయంలో ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు కెసిఆర్ ఉంటున్నారు. వాస్తు కారణాల వల్ల కెసిఆర్ ఇక్కడి ఇంటిని మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. కార్యాలయాన్ని ఉపయోగించుకోవడం లేదు. కెసిఆర్ సీఎంగా పగ్గాలు చేపట్టినపర్పటి నుంచి వాస్తు చూసి మంచి భవనం నిర్మించాలని భావిస్తున్నారు.