ఆర్టీసీ సంఘాలు అక్కడే చిక్కాయి..! కార్మికులపై ఒత్తిడి పెంచేలా సీఎం: తెర మీదకు సెల్ఫ్ డిస్మిస్..!
ఉమ్మడి రాష్ట్రం నుండి ఇప్పటి వరకు తెలంగాణలో ఎన్నో సార్లు ఆర్టీసీ సమ్మెలు జగిరాయి. కానీ..ఇంత కఠినంగా కేసీఆర్ ప్రభుత్వం తరహాలో ఎవరు అధికారంలో ఉన్న వ్యవహరించలేదు. కార్మిక సంఘాలు చేసిన ఆ ఒక్క పొరపాటు ప్రభుత్వానికి అస్త్రంగా మారింది. కోర్టులో ప్రభుత్వ వాదనలు చూసినా..ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తుందా అనే అనమానం కలుగుతోంది. ఎలాగైనా కార్మిక సంఘాల పెత్తనం తగ్గించి..వారు ప్రభుత్వానికి డెడ్ లైన్లు పెట్టే పరిస్థితిని సీఎం సీరియస్ గా తీసుకున్నారు. దీంతో..విధుల్లో చేరని వారు ఉద్యోగాలు కోల్పోయినట్లే అని చెబుతూ..ఎక్కడా ప్రభుత్వం వారిని తొలిగించలేదని చెబుతున్నాయి. అదే సమయంలో వాళ్లంతట వాళ్లే తొలగిపోయారు.
గడువు లోపల విధుల్లో చేరకపోవడంతో వాళ్లది సెల్ఫ్ డిస్మిస్ అనే కొత్త అంశం తెర మీదకు తెచ్చారు. ముఖ్యమంత్రి ఆలోచనలు చూస్తుంటే కార్మికులు అందరినీ సమస్య పరిష్కారం అయినా తిరిగి విధుల్లో తీసుకొనే ఆలోచన కనిపించటం లేదు. అందులో భాగంగానే ప్రభుత్వం వ్యూహాత్మకంగా మైండ్ గేమ్ ఆడుతోంది. రాజకీయంగా ఎలా ఉన్నా తాను ప్రజల కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నాననే భావన కలిగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఆర్టీసీ ప్రక్షాళనే! మొత్తం ప్రైవేటీకరించం, 3 రకాలుగా విభజన: కేసీఆర్ సంచలనం
అక్కడే పొరపాటు జరిగిందా..
కార్మిక సంఘాలు ముందుగానే సమ్మె నోటీసు ఇచ్చాయి. కానీ..వారు సరిగ్గా ఈ నెల 5వ తేదీన సమ్మె ప్రారంభించాలని నిర్ణయించాయి. దసరా..బతుకమ్మ తెలంగాణ ప్రజలకు ప్రాధాన్యత కలిగినవి. ప్రజలు ఇబ్బంది పడతారని తెలిసీ అదే ముహూర్తాన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించుకున్నాయి. ఈ సమయంలో అయితేనే తమ ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గుతుందనే అభిప్రాయంతో ప్రజలకు విషయాన్ని వివరిస్తూ కార్మిక నేతలు సమ్మెలోకి దిగారు.
ఇదే ప్రభుత్వానికి అస్త్రంగా మారింది. పండుగ రోజుల్లో ప్రజలను ఇబ్బంది పెట్టటానికే ఈ సమయం కార్మిక సంఘాలు ఎంచుకున్నాయని..తాము ఈ బ్లాక్ మెయిలింగ్ కు లొంగేది లేదని ప్రభుత్వం ప్రజలకు చెప్పుకొనే అవకాశం కలిగింది. దీనినే ఇప్పుడు ప్రభుత్వం అస్త్రంగా మలచుకొంది.
కోర్టు వాదనలతోనే వ్యూహం సుస్పష్టం..
సమ్మె పైన హౌస్ మోషన్ పిటీషన్ వాదనల సమయంలో ప్రభుత్వం తమ వైఖరి స్పష్టం చేసింది. సమ్మె కారణంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని..ఈ విషయంలో ఆందోళన అవసరం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాదులు స్పష్టం చేసారు. దీని ద్వారా కార్మిక సంఘాలను తిరిగి విధుల్లోకి వెళ్లాలని కోర్టు ఆదేశిస్తే..వారందరికీ తిరిగి ఉద్యోగాల్లో కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఇది ప్రభుత్వానికి ఇష్టం ఉన్నట్లుగా లేదు. ఆర్టీసీలో సంస్కరణలకు ఇదే సరైన సమయంగా ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా సిబ్బంది కుదింపు ఒక భాగం. అయితే..తరువాతి రోజుల్లో సమస్య ముగిసి కార్మికులు తిరిగి విధుల్లో చేరాలని నిర్ణయించినా..ప్రభుత్వం ఎటువంటి షరతులు అమలు చేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
తెర మీదకు సెల్ఫ్ డిస్మిస్..
ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా తెర మీదకు సెల్ఫ్ డిస్మిస్ అనే అంశాన్ని తీసుకొచ్చారు. విధుల్లో చేరని వారు ఉద్యోగాలు కోల్పోయినట్లే అని చెబుతూ..ఎక్కడా ప్రభుత్వం వారిని తొలిగించలేదని చెబుతున్నాయి. అదే సమయంలో వాళ్లంతట వాళ్లే తొలగిపోయారు. గడువు లోపల విధుల్లో చేరకపోవడంతో వాళ్లది సెల్ఫ్ డిస్మిస్ అని చెప్పుకొచ్చారు. దీని ద్వారా ఉద్యోగుల తొలిగింపు విషయంలో మార్పు లేదని చెబుతూనే అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదని..కార్మికులే ఆ పరిస్థితి తెచ్చుకున్నారని చెప్పటమే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది.
తిరిగి విధుల్లో చేరే పరిస్థితి వచ్చినా..ప్రభుత్వం ఆర్టీసీలో ప్రయివేటు భాగస్వామ్యం నిర్ణయాలు.. తీసుకుంటున్న చర్యలకు అంగీకరించి..కార్మిక సంఘాలుగా కొనసాగమని స్పష్టత ఇస్తేనే ప్రభుత్వం వారిని విధుల్లోకి అనుమతించే పరిస్థితి కనిపిస్తోంది. 48 వేల మందిని ఉద్యోగాల నుండి తప్పిస్తే రాజకీయంగా వచ్చే నష్టం బాగా తెలిసిన ముఖ్యమంత్రి.. వ్యూహాత్మకంగా కార్మిక సంఘాల మీద ఒత్తిడి పెంచే వ్యూహాలను అమలు చేస్తున్నారు.