శాంత కుమారికి సీఎం రేవంత్ కీలక పదవి..!!
ముఖ్యమంత్రి రేవంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పాలనా పరంగా ప్రక్షాళన చేస్తున్న సీఎం రేవంత్ తాజాగా పలువురు సీనియర్ ఐఏఎస్ ల బాధ్యతల్లో మార్పులు చేసారు. రాష్ట్ర నూతన సీఎస్ గా రామకృష్ణారావును నియమించారు. దీంతో, ప్రస్తుత సీఎస్ గా రేవంత్ ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ సాగింది. ఈ నెల 30న సీఎస్ గా పదవీ విరమణ చేసిన తరువాత శాంత కుమరికి కీలక పదవి ఇస్తారనే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు సీఎం రేవంత్ ప్రస్తుత సీఎస్ శాంత కుమారికి కీలక పదవి ఖరారు చేసారు.
రేవంత్ తాజా నిర్ణయం
పాలనా పరంగా సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనలో కీలకమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకంలో రామకృష్ణారావు వైపు రేవంత్ మొగ్గు చూపారు. తాజాగా జరిగిన ఐఏఎస్ ల బదిలీల్లో సీనియర్లకు స్థాన చలనం కలిగింది. సీఎంఓలోనూ మార్పులు చేర్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత సీఎస్ శాంత కుమారి ఈ నెలాఖరున పదవీ విరమణ చేయ నున్నారు. కేసీఆర్ హయాంలో సీఎస్ గా నియమితులైన శాంత కుమారిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా రేవంత్ కొనసాగించారు. రేవంత్ నిర్ణయాల అమలులో శాంత కుమారి శక్తి మేర పని చేసారు.

సీఎస్ నియామకం
ఈ నెలాఖరులో శాంత కుమారి పదవీ విరమణ ఉండటంతో.. తొలుత మరో మూడు నెలల వరకు పొడిగించే అవకాశం ఉందని భావించారు. అయితే, ఇప్పుడు శాంత కుమారి ఈ నెలాఖరున తన బాధ్యత నుంచి తప్పుకునేందుకు సిద్దమయ్యారు. కొత్తగా సీఎస్ గా బాధ్యతలు స్వీకరించనున్న సీనియర్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు 1990 బ్యాచ్ ఐఏఎస్కు చెందిన వారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రామకృష్ణారావు వచ్చే ఆగస్టులో రిటైర్ అవనున్నారు. ఇక, 1989 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన శాంతి కుమారి 2023 జనవరి 11వ తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ కొత్త సీఎస్ విషయంలో తీసుకునే నిర్ణయం పైన కొద్ది రోజులుగా అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.
కీలక బాధ్యతలు
ఇక, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం శాంత కుమారిని ఎంసీహెచ్ఆర్డీ వైస్ ఛైర్మన్ గా నియమించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు సిద్ధమయ్యాయి. ఈ నెల 30న పదవీ విరమణ తరువాత శాంత కుమారి ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. తొలుత శాంత కుమారికి సమాచార హక్కు చట్టం ప్రధాన కమీషనర్ గా బాధ్యతలు ఇస్తారని భావించారు. అయితే, ప్రస్తుతం సీఎంఓలో ఉన్న ఒక అధికారికి ఈ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో, శాంతు కుమారికి ఈ పదవి ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications