విచారం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదా? అంటూ నిలదీసింది. హెచ్చరికలను జారీ చేసింది. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుపై తెలంగాణ ముఖ్యమంత్రికి గౌరవం లేకపోతే ఎలా? అని ప్రశ్నించింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన 2015 నాటి ఓటుకు నోటు కేసును తెలంగాణ నుంచి వెలుపలికి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలంటూ పిటీషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటీషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటీషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ సుందరం, ఇండిపెండెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గీ, మేనకా గురుస్వామి తమ వాదనలను వినిపించారు.
వాదనల సందర్భంగా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిపై అసహనాన్ని వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుపై రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై తీవ్ర అభ్యంతరకరమని పేర్కొంది. రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్లు సుప్రీంకోర్టుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలిపింది.
ఎవరు విమర్శించినా పట్టించుకోకుండా తమ మనస్సాక్షి ప్రకారం విధులను నిర్వహిస్తామని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. చట్టసభల పరిధిలో ఉన్న అంశంలో తాము జోక్యం చేసుకోబోమనే విషయాన్ని ఎప్పుడూ చెబుతుంటామని అన్నారు. అనంతరం ఈ కేసుపై విచారణను సెప్టెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.
సుప్రీంకోర్టు తనపై చేసిన వ్యాఖ్యాలపై రేవంత్ రెడ్డి స్పందించారు. విచారం వ్యక్తం చేశారు. దేశ న్యాయవ్యవస్థపై తనకు అత్యంత గౌరవం పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. తాను సుప్రీంకోర్టు విజ్ఞతను ప్రశ్నించినట్లుగా కొన్ని పత్రికలు, మీడియాలో వచ్చిన కథనాలు అలాంటి అభిప్రాయాన్ని కలిగించినట్లుగా భావిస్తున్నానని వివరణ ఇచ్చారు.
తాను న్యాయ ప్రక్రియ పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నానని, మీడియాలో వచ్చిన కథనాల పట్ల బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నానని రేవంత్ రెడ్డి చెప్పారు. న్యాయవ్యవస్థను తాను ఎంతగానో గౌరవిస్తానని, రాజ్యాంగాన్ని దృఢంగా విశ్వసిస్తానని పునరుద్ఘాటించారు.












Click it and Unblock the Notifications