CM Revanth Reddy: కేసీఆర్ వందేళ్లు ప్రతిపక్షంలోనే ఉండాలి.. బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ ఫైర్
CM Revanth Reddy: భారత రాజ్యాంగ స్ఫూర్తితోనే మనమా వ్యవస్థలను నడుపుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ ప్రసంగించారు. 2022 బడ్జెట్ సమావేశాల్లో గత ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు నిర్వహించారని.. మహిళా గవర్నర్ ను అవమానించేలా వ్యవహరించారని సీఎం విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వ్యవస్థలను సంస్థలను గౌరవించుకుంటూ ముందుకు వెళుతున్నామన్నారు.
అజ్ఞానాన్నే విజ్ఞానం అనుకుంటున్నారు..
సీనియర్లమని, పదేళ్లు మంత్రులుగా చేసినమని చెప్పుకునేవాళ్లు గవర్నర్ ప్రసంగాన్ని తప్పుబట్టారని.. వాళ్లు వారి అజ్ఞానాన్నే తమ విజ్ఞానమని అనుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. మంత్రివర్గం ఆమోదం పొందిన అంశాలనే గవర్నర్ తమ ప్రసంగంలో వినిపించారన్నారు. ఎలక్షన్ మేనిఫెస్టోలోని అంశాలను ప్రభుత్వంలో అమలు చేస్తున్నామన్నారు. మేం అమలు చేసే వాటినే మంత్రివర్గం ఆమోదించి గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచామని సీఎం చెప్పారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ఉండదన్నారు. పదేళ్లు పాలించినవారు మంత్రివర్గం ఆమోదం లేకుండానే గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచారా అంటూ ప్రశ్నించారు. వాళ్లకు గవర్నర్ పై గౌరవం లేకనే మహిళను అవమానించారన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం.. మేం రాజ్యాంగబద్ధంగా వ్యవస్థను గౌరవిస్తామన్నారు.

ఆ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే..
సభ్యులు ప్రస్తావించిన అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుంటామని.. వారి సూచనలు తీసుకునేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. పదేళ్ల విధ్వంసం, నియంతృత్వాన్ని పారద్రోలి ప్రజలు మార్పును కోరుకున్నారు.. అందుకే ప్రజల ఆశీర్వాదంతో మేం ఇక్కడ ఉన్నామన్నారు. తెలంగాణ ప్రజలు 70 శాతం వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని.. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసమే గతంలో తెలంగాణలో పోరాటాలు జరిగాయని సీఎం రేవంత్ తెలిపారు. భూమి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవమని ఆయన స్పష్టం చేశారు. రైతులకు రూ.20624 కోట్లు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని.. రైతులు ఆత్మగౌరవంతో బ్రతికేలా చేసిన ఘనత మాదేనని ముఖ్యమంత్రి అన్నారు.
రైతు భరోసాను పెంచిన ఘనత మాదే..
ఎన్నికలను అడ్డు పెట్టుకుని ఆనాటి ప్రభుత్వం రైతు బంధు ఎగ్గొడితే.. మేం అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలల్లో రూ. 7625 కోట్లు రైతు బంధు రైతుల ఖాతాల్లో వేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వెల్లడించారు. రైతు భరోసాను రూ. 12 వేలకు పెంచిన ఘనత కాంగ్రెస్ సర్కారుదేనని తెలిపారు. భూమిలేని నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ప్రతి కుటుంబానికి రూ. 12 వేలు అందిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని ఆనాటి ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయలేదని.. వరి వేస్తే ఊరే అని మాట్లాడారన్నారు. కానీ మేం ధాన్యం కొనుగోలు చేసి రూ.1206 కోట్లు సన్న వడ్లకు బోనస్ అందించామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కాళేశ్వరం లేకుండానే రైతులు రూ.1 కోటి 56 లక్షలు మెట్రిక్ టన్నుల ధాన్యం పండించారన్నారు.
అది నిజం కాదా..
రైతు కమిషన్ ఏర్పాటు చేసి రైతుల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పోరాటాలు చేశామని చెప్పుకునే వారు ఆనాడు చంద్రబాబుకు మోకరిల్లి 299 టీఎంసీలు చాలని సంతకం పెట్టి తెలంగాణకు శాశ్వత మరణ శాసనం రాసింది వాళ్లు కాదా అంటూ రేవంత్ ప్రశ్నించారు. మేం అధికారంలోకి రాగానే కేంద్రంను కలిసి నీళ్ల కోసం కొట్లాడామన్నారు. వైఎస్ ఆశీర్వాదంతో కేంద్ర మంత్రి అయిన కేసీఆర్ పోతిరెడ్డిపాడు పొక్కను పెద్దది చేస్తుంటే చూస్తూ ఊరుకున్నది నిజం కాదా .. తెలంగాణ జిల్లాలను వలస జిల్లాలుగా మార్చి రైతులను పొట్టన పెట్టుకుంది వీళ్లు కాదా.. ఆనాడు వీళ్లు సహకరించకపోతే పోతిరెడ్డి పాడు పొక్క పెద్దదయ్యేదా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
కమీషన్లకు కక్కుర్తి పడి..
కేసీఆర్ కాంట్రాక్టర్లు ఇచ్చిన కమీషన్ల కోసం కక్కుర్తి పడి జూరాలను రెండు టీఎంసీ ల నుంచి ఒక టీఎంసీకి తగ్గించి... నీళ్లను శ్రీశైలంకి పంపించడం వల్ల ప్రాజెక్టును పూర్తి చేసినా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి దాపురించిందన్నారు.ఎస్ఎల్బీసీని నాలుగేళ్లల్లో పూర్తి చేయాల్సింది పదేళ్లయినా పూర్తి చేయకుండా నల్గొండకు అన్యాయం చేసింది నిజం కాదా అంటూ పేర్కొన్నారు. ఇవాళ జరిగిన ఎస్ఎల్బీసీ ప్రమాదానికి, ఎనిమిది మంది చావుకు కారణం మీరు కాదా అంటూ ఆరోపించారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో పదేళ్లలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ఎందుకు పూర్తిచేయలేదని ఆయన ప్రశ్నించారు. మా ప్రశ్నలకు సంధానం ఇవ్వాల్సి వస్తుందని ఇవాళ సభ నుంచి వెళ్లిపోయారన్నారు. 15 నెలల్లో కేసీఆర్ సభకు కేవలం రెండుసార్లు మాత్రమే వచ్చారని.. ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుని ప్రజలను వారి కర్మకు వదిలేసిన నాయకుడు కేసీఆర్ అంటూ మండిపడ్డారు.
ఆ సవాల్ కు కేసీఆర్ సిద్ధమా..
ఎస్ఎల్బీసీ, డిండి పూర్తి చేసి ఉంటే నల్గొండ కష్టాలు తీరేది కదా అంటూ పేర్కొన్నారు. కేసీఆర్ ఏ రోజు వస్తే ఆరోజు కృష్ణా జలాలపై చర్చ పెడదామన్నారు. లెక్కలతో సహా నిరూపించడానికి మేం సిద్ధంగా ఉన్నామన్నారు. మాది తప్పయితే బీఆర్ఎస్ నాయకులకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని.. ఈ సవాల్ కు కేసీఆర్ సిద్ధమా అంటూ సీఎం రేవంత్ ఛాలెంజ్ చేశారు. రోజులు 10 టీఎంసీలు తరలించుకుపోయే ప్రాజెక్టులు పక్క రాష్ట్రం నిర్మిస్తుంటే కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారన్నారు. ఒక సామాన్య రైతు గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళితే... విధి లేని పరిస్థితుల్లో ఆనాటి ప్రభుత్వం ఇంప్లీడ్ అయిందన్నారు. రోజమ్మ రొయ్యల పులుసు తిని విశ్వాసం చూపిన కేసీఆర్... రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరును పడావు పెట్టారన్నారు.
కేసీఆర్ వందేళ్లు ప్రతిపక్షంలోనే ఉండాలి..
కేసీఆర్ వద్ద ఉన్న కుర్చీని నాలుగు కోట్ల మంది గుంజుకుని నన్ను కూర్చోబెట్టారన్న రేవంత్.. చంద్రశేఖరరావు వద్ద తీసుకోవడానికి ఇంకేముందన్నారు. వారి వద్ద ఉన్నది ప్రధాన ప్రతిపక్ష హోదా అని.. ఆ హోదా కేటీఆర్, హరీష్ రావుకు కావాలన్నారు. తప్పుడు మాటలను తనపై ఆపాదిస్తున్నారు.. కేసీఆర్ వందేళ్లు ఆయురారోగ్యాలతో ప్రతిపక్షంలోనే ఉండాలన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు జరిగిన సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.












Click it and Unblock the Notifications