మహిళలకు శుభవార్త.. కొత్తగా రోడ్డెక్కనున్న ఇందిరా మహిళా శక్తి బస్సులు!
తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారత, వారి ఆర్థిక బలోపేతమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక అడుగు వేసింది. 'ఇందిరా మహిళా శక్తి' పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలను కేవలం ప్రయాణికులుగా కాకుండా, బస్సుల యజమానులుగా మార్చే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
400 కొత్త ఇందిరా మహిళా శక్తి బస్సులు
ఇందులో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే భారీ 'మహిళాశక్తి సభ'లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సంఘాలకు 553 ఆర్టీసీ బస్సులను అధికారికంగా అందజేసి, జెండా ఊపి ప్రారంభించనున్నారు. వీటిలో తాజాగా జోడించిన 400 కొత్త ఇందిరా మహిళా శక్తి బస్సులు కూడా ఉన్నాయి. ఈ పథకం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలు కేవలం రవాణా వ్యవస్థలో భాగస్వాములుగా మారడమే కాకుండా, అద్భుతమైన స్థిర ఆదాయాన్ని పొందనున్నాయి.

బస్సులకు రూ.69,468 అద్దె రూపంలో నేరుగా మహిళాసంఘాల ఖాతాల్లో జమ
మహిళా సంఘాల ద్వారా బ్యాంకురుణాల సహాయంతో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ఈ బస్సులను కొనుగోలు చేయించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. తెలంగాణ రవాణా సంస్థ TGSRTC ఈ 553 బస్సులను అద్దె ప్రాతిపదికన నడుపుతుంది. బస్సులకు అవసరమైన డ్రైవర్లు, కండక్టర్లను ఆర్టీసీ యాజమాన్యమే సమకూరుస్తుంది. డ్రైవర్, కండక్టర్ జీతభత్యాలు, ఇతర నిర్వహణఖర్చులు పోను ఒక్కో బస్సుకు ప్రతి నెల రూ.69,468 అద్దె రూపంలో నేరుగా మహిళాసంఘాల ఖాతాల్లో జమ అవుతుంది.
ఏడాదికి మొత్తంగా రూ. 244.08 కోట్ల స్థిరమైన అద్దె ఆదాయం
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు రూ. 199.08 కోట్ల భారీ పెట్టుబడిని పెట్టాయి. దీనికి ప్రతిఫలంగా వారికి ప్రతి నెల రూ. 20.34 కోట్ల చొప్పున.. ఏడాదికి మొత్తంగా రూ. 244.08 కోట్ల స్థిరమైన అద్దె ఆదాయం సమకూరనుంది. ప్రారంభంలో తీసుకున్న బ్యాంకు రుణాలు పూర్తిగా చెల్లింపు పూర్తయిన తర్వాత, ఆ బస్సులు పూర్తిగా సదరు మహిళా సమాఖ్యల సొంత ఆస్తిగా మారిపోతాయి.
మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేలా ప్రభుత్వం ప్లాన్
దేశంలోనే మహిళా సంఘాలకు ఈ స్థాయిలో ఆర్టీసీ బస్సులను కేటాయించి, వారిని వ్యాపారవేత్తలుగా మార్చేలా ఇలాంటి వినూత్న పథకాన్ని అమలు చేయడం తెలంగాణలోనే ప్రథమం కావడం విశేషం. బస్సుల పంపిణీతో పాటు మహిళలు వివిధ రకాల స్వయం ఉపాధి రంగాలలో, కుటీర పరిశ్రమలలో రాణించేందుకు వీలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా రూ. 500 కోట్ల విలువైన 'వడ్డీ లేని రుణాల' చెక్కులను కూడా మహిళా ప్రతినిధులకు అందజేస్తారు.
మహిళల చేతుల్లో ఆర్టీసీ బస్సులు
రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, స్కూల్ యూనిఫాం తయారీ కేంద్రాల అనంతరం ఇప్పుడు ఆర్టీసీ బస్సుల నిర్వహణను కూడా మహిళల చేతుల్లో పెడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు.













Click it and Unblock the Notifications