తెలంగాణ పబ్లిక్ స్కూల్.. రేవంత్ మార్క్ విద్యా విప్లవం.
"తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రంగుల గోడల్లోనో లేదా అద్దాల మేడల్లోనో లేదు.. అది కేవలం మన ప్రభుత్వ పాఠశాలల తరగతి గదుల్లోనే దాగి ఉందని మేం సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం" అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామంలో రూ.15 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నూతనంగా నిర్మించిన 'తెలంగాణ పబ్లిక్ స్కూల్' (TPS) ను ఆయన బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని డిజిటల్ క్లాస్రూమ్లు, ల్యాబ్లు, లైబ్రరీ, అత్యాధునిక కిచెన్, డైనింగ్ హాల్ను సీఎం స్వయంగా పరిశీలించారు. వంట గదిలో పూరీలు చేసిన సీఎం అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్నారు. స్కూల్ గ్రౌండ్లో వారితో సరదాగా ఫుట్బాల్ ఆడి సందడి చేశారు.
ఒక ప్రభుత్వ బడికి 'నో అడ్మిషన్' బోర్డు.. చరిత్రలోనే తొలిసారి!
ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఆరుట్లలో ప్రారంభమైన ఈ మోడల్ పాఠశాలను రాష్ట్రంలోని 27 లక్షల మంది ప్రభుత్వ విద్యార్థులకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. "ధ్వంసమైన విద్యావ్యవస్థను వికాసం వైపు నడిపించేందుకే ఈ పాఠశాలలను తెచ్చాం. ఇప్పటికే ఆరుట్ల స్కూల్లో 1,814 మంది విద్యార్థులు చేరారు. కార్పొరేట్ సంస్థలకు పోటీగా ఒక ప్రభుత్వ పాఠశాలకు 'నో అడ్మిషన్' బోర్డు పెట్టే పరిస్థితి రావడం నిజంగా గర్వకారణం. ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందిస్తున్నా" అని సీఎం కొనియాడారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ప్రతీ శాసనసభ నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

ప్రభుత్వ బడిలోనే చదివి సీఎంనయ్యా..
సమాజంలో అసమానతలు పోవాలన్నా, తల్లిదండ్రులు ఆత్మగౌరవంతో బతకాలన్నా నాణ్యమైన విద్య ఒక్కటే మార్గమని సీఎం ఉద్ఘాటించారు. "ప్రభుత్వ బడుల్లో చదవడం నామోషీ అనే అపోహ వీడాలి. ఇక్కడ చదివిన ఎందరో గొప్ప అధికారులు, నాయకులుగా ఎదిగారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారితో పాటు నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను. ఇక్కడ చదివే ముఖ్యమంత్రి స్థాయికి చేరాను. మన విద్యార్థులు కూడా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, కాబోయే రాజకీయ నాయకులుగా ఎదగాలి" అని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం కులాల వారీగా స్కూళ్లు పెట్టి కుల వ్యవస్థను ప్రోత్సహిస్తే, తాము ఆ వివక్షను తుడిచేయడానికే 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్' నిర్మిస్తున్నామని, అలాగే డిసెంబర్ 9న 'యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ' భవనాన్ని ప్రారంభించబోతున్నామని వెల్లడించారు.
రూ.680 కోట్ల టెండర్లలో రూ.2వేల కోట్ల స్కామా?.. ప్రతిపక్షాలపై నిప్పులు!
రాష్ట్ర బడ్జెట్లో విద్యాశాఖపైనే ఏకంగా రూ.27 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, గతంలో ఇచ్చిన నాసిరకం యూనిఫామ్ల స్థానంలో తాము రూ.680 కోట్లతో నాణ్యమైన విద్యా కిట్ల పంపిణీకి టెండర్లు పిలిచామని సీఎం చెప్పారు. అయితే, దీనిపై రూ.2వేల కోట్ల స్కామ్ జరిగిందని కొందరు ఆరోపించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. "రూ.680 కోట్ల టెండర్లలో రూ.2వేల కోట్ల అవినీతి ఎలా సాధ్యమో ఆ మేధావులే చెప్పాలి" అని ఎద్దేవా చేశారు.
క్రీడలను ప్రోత్సహించేందుకు ఒలింపిక్స్ లక్ష్యంగా 'యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ'ని ఏర్పాటు చేశామని, గతంలో తాము ఫుట్బాల్ దిగ్గజం 'మెస్సీ'ని హైదరాబాద్కు రప్పిస్తే దానిపైనా రాజకీయ విమర్శలు చేశారని మండిపడ్డారు. "కడుపులో కుళ్లు పెట్టుకుని ప్రతిదానిపై అబద్ధాలు ప్రచారం చేసే వాళ్లకు భవిష్యత్తులో ప్రతిపక్ష హోదా కూడా మిగలదు. విమర్శలు చేసేవాళ్లు ఉంటే వారికి వచ్చి ఆరుట్ల స్కూల్ చూపించండి. ప్రజలు మాకు అండగా నిలబడితే తెలంగాణను దేశానికే రోల్ మోడల్గా తీర్చిదిద్దుతాం" అని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు.














Click it and Unblock the Notifications