రేవంత్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు.. !!
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సందడి ఆరంభమైంది. నేడు భోగి పండగను వైభవంగా జరుపుకొంటోన్నారు. ఈ తెల్లవారు జామున భోగి మంటలు వెలిశాయి. రంగవల్లులతో తెలుగు లోగిళ్లు సరికొత్త అందాలను సంతరించుకున్నాయి. కోడిపందేలు, గంగిరెద్దుల ఆటలతో ఈ వారం అంతా కూడా ఏపీ, తెలంగాణల్లో పండగ కోలాహలం కొనసాగనుంది. దూరప్రాంతాల నుంచి వచ్చిన ఆప్తులతో ఆయా కుటుంబాలు, ప్రత్యేకించి పల్లె ప్రాంతాలు కళకళలాడుతున్నాయి.
సంక్రాంతి పండగ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి కుటుంబానికి శ్రేయస్సు, సుఖ సంతోషాలను తీసుకు వచ్చే భోగి పండగ.. కొత్త వెలుగులు, ఆశలను తీసుకువచ్చే సంక్రాంతి, కనుమ పండుగలను అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి తెలుగు కుటుంబంలో పండగ కాంతులు వెల్లివిరియాలని కోరారు.

తన ప్రభుత్వ అమలు చేస్తోన్న అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల గురించి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కుటుంబానికి చేరేలా చూడడమే ప్రజా ప్రభుత్వ దృఢ సంకల్పమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, తయారీ, సేవల రంగంలో తెలంగాణ అసమానమైన పురోగతిని సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ.. దేశంలో అగ్రగామి అవుతుందని అన్నారు.
తెలంగాణ రైజింగ్ విజన్ 2047ను సాకారం చేసుకోవడానికి ప్రజా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. గొప్ప తెలుగు సంప్రదాయాలు, సాంస్కృతిక స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. గాలిపటాలను ఎగురవేసేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గాలిపటాల ఎగురవేతపై ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు, విద్యుత్ సిబ్బంది పలు సూచనలను ఇచ్చారు.












Click it and Unblock the Notifications