ఆక్స్ఫర్డ్లో సీఎం రేవంత్రెడ్డి.. 900 ఏళ్ల ఘనమైన చరిత్ర
తెలంగాణను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో విదేశీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో పర్యటిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత పురాతన, ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి సందర్శించారు. దాదాపు 900 ఏళ్ల ఘనమైన చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయంలోని 'బ్లావాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్'ను సందర్శించి, ప్రొఫెసర్ మాయా ట్యూడర్, ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీలతో పాలన, విద్య, ప్రజా విధానాలపై విస్తృతంగా చర్చించారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చదువుకున్న ఈ విశ్వవిద్యాలయంతో భారత్కు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
హైదరాబాద్ కు ఆక్స్ఫర్డ్ బృందం
తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రొఫెసర్లు మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్జీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర యువత, ఉద్యోగ నిపుణులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యానికి ఉన్న పలు అవకాశాలను ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ప్రతినిధి బృందాన్ని పంపాలని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులను తెలంగాణ బృందం ఆహ్వానించింది. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చారిత్రక సోమర్విల్ కాలేజీని సందర్శించారు. ఈ కాలేజీలో విద్యాభ్యాసం చేసిన దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిత్రపటాన్ని సందర్శించారు. 2002లో సోనియా గాంధీ ఈ చిత్రపటాన్ని సోమర్విల్ కాలేజీకి బహూకరించిన విషయం తెలిసిందే.

అనంతరం ముఖ్యమంత్రి, అక్కడే జీఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తున్న యుటిలిటా బౌల్ను సందర్శించారు. జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంథితో కలిసి అక్కడి సమగ్ర క్రీడా సదుపాయాలను పరిశీలించారు. ఈ ప్రాంగణంలో గోల్ఫ్ కోర్స్తో పాటు వివిధ క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, హోటల్ ఉన్నాయి. తెలంగాణలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి జీఎంఆర్ ప్రతినిధులు, సంస్థ గ్లోబల్ స్పోర్ట్స్ యూనిట్తో మంతనాలు జరిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి, ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారిని ఆహ్వానించారు. శుక్రవారం సాయంత్రం ప్రస్తుత ప్రీమియర్ లీగ్ చాంపియన్స్ ఆర్సెనల్, కోవెంట్రీ మధ్య జరిగే ఈపీఎల్ మ్యాచ్ను వీక్షించేందుకు ముఖ్యమంత్రి ఎమిరేట్స్ స్టేడియాన్ని సందర్శించనున్నారు.
మరోవైపు, సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని 'తెలంగాణ రైజింగ్' బృందానికి అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించడంతో ఆ పర్యటన రద్దయింది. విధివిధానాలు, ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం యూకే, అమెరికా పర్యటనలకు అనుమతి కోరగా, తొలుత యూకేకు మాత్రమే లభించింది. బృందం యూకే చేరుకున్న తర్వాత పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వడం లేదని కేంద్రం సమాచారం అందించింది. తెలంగాణ అభివృద్ధికి, నూతన విద్యా విధానంలో భాగంగా ప్రపంచ స్థాయి ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలను రాష్ట్రానికి తీసుకురావడానికి ఉద్దేశించిన పర్యటనకు "రాజకీయ కారణాలతో" అనుమతి నిరాకరించడం పట్ల సీఎం రేవంత్రెడ్డి తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. కేంద్ర నిర్ణయాన్ని గౌరవిస్తూ అమెరికా వెళ్లకుండా లండన్ నుంచే హైదరాబాద్ తిరిగొస్తామని ప్రకటించారు














Click it and Unblock the Notifications