తెలంగాణను వణికిస్తున్న చలి: హైదరాబాద్, మల్కాజిగిరిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు, మరో 3 రోజులు
హైదరాబాద్: తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో శుక్రవారం తెల్లవారు జామున ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. కనిష్ఠంగా 11.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్, మల్కాజిగిరిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో మూడురోజులు చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణశాఖ పేర్కొంది.
బంగాళాఖాతంలో రెండు ఆవర్తనాలు ఏర్పడగా.. ఇందులో ఒకటి నైరుతి దిశలో తమిళనాడుకు దగ్గరలో ఉంది. భూమికి 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల వరకు ఉంది. రెండో ఆవర్తనం తమిళనాడుకు దక్షిణంగా.. సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. అయితే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణశాఖ తెలిపింది.

తూర్పు రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో మేఘావృతమై ఉంటుందని, రాత్రి సమయంలో చలి ఉంటుందని పేర్కొంది. తెలంగాణలో గాలులు గంటకు 4 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పింది. శుక్రవారం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 31 డిగ్రీలు కాగా.. కనిష్ఠంగా 19 డిగ్రీలుగా నమోదైంది.
శుక్రవారం తెల్లవారు జామున రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్లో 11.2 డిగ్రీల సెల్సియస్, మౌలాలిలో 11.5, బీహెచ్ఈఎల్లో 12.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణశాఖ వెల్లడించింది. కాగా, ఇప్పటికే చలి కాలం ప్రారంభం కాగా, గత నాలుగైదు రోజుల నుంచే రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గినప్పటికీ.. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటోంది. అయితే, చలి తీవత్ర మాత్రం మరో రెండు నెలలు కొనసాగే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications