మాటల్లోనే కాదు.. చేతల్లోనూ నిరూపించారు... కేసీఆర్ను కొనియాడిన కల్నల్ సంతోష్ కుటుంబం...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తమ ఇంటికి వచ్చి పరామర్శించడమే కాకుండా... ఎప్పుడు ఏ సహాయానికైనా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారని దివంగత వీర జవాన్ కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషి తెలిపారు. సంతోష్ గారిని తిరిగి తీసుకురాలేమని.. కానీ ఆయన లేని లోటు రాకుండా చూస్తామని ధైర్యం ఇచ్చారన్నారు. చెప్పినట్టుగానే తన పిల్లల పేరుపై రూ.4కోట్లు,సంతోష్ తల్లిదండ్రులకు రూ.1కోటి చెక్ ఇచ్చారన్నారు. అలాగే బంజారాహిల్స్లో కేబీఆర్ పార్క్ సమీపంలో 711 గజాల నివాస స్థలంతో పాటు.. కోరుకున్న డిపార్ట్మెంట్లో గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామని చెప్పారన్నారు. ఇంట్లో పిల్లలతోనూ కాసేపు గడిపారని చెప్పారు.
Recommended Video

చేతల్లోనూ నిరూపించారని కొనియాడిన తల్లి..
ముఖ్యమంత్రి గారి ఇంటికి తమను విందుకు కూడా ఆహ్వానించారని సంతోషి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి తమ కుటుంబం రుణపడి ఉంటుందన్నారు. సంతోష్ బాబు తల్లి మాట్లాడుతూ... ముఖ్యమంత్రే స్వయంగా ఇంటికి వచ్చి పరామర్శించడం కొండంత ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. ఇంతకుముందు ప్రకటించినట్టుగానే నగదు,అలాగే హైదరాబాద్లో నివాస స్థలం ఇచ్చారన్నారు. కోడలికి కోరుకున్న శాఖలో గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామని చెప్పారన్నారు. ఏ సమయంలో ఏ అవసరం ఉన్నా ఆదుకుంటామని భరోసా ఇచ్చారన్నారు. కేసీఆర్ గొప్పతనం మాటల్లోనే కాదు.. చేతల్లోనూ నిరూపించారని కొనియాడారు. కేసీఆర్కు,మంత్రి జగదీశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అంత్యక్రియలు జరిగిన నాటి నుంచి ఇప్పటివరకూ జగదీశ్వర్ రెడ్డి అన్ని విధాలా తమ కుటుంబానికి అండగా నిలిచారని చెప్పారు.

ఏ సహాయం కావాలన్నా ఆదుకుంటామన్న మంత్రి...
మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ... కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి ఏ సమస్య వచ్చినా తాము అండగా ఉంటామన్నారు. సంతోష్ బాబు కోరిక మేరకు హైదరాబాద్లో ఇంటి స్థలం ఇచ్చామన్నారు. అలాగే సూర్యాపేటలో ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. విగ్రహ ఏర్పాటు తర్వాత ఆ చౌరస్తాకు సంతోష్ బాబు చౌరస్తాగా నామకరణం చేస్తామన్నారు.

ఎల్లవేళలా అండగా ఉంటామన్న సీఎం...
ఇటీవల సంతోష్ బాబు అంత్యక్రియలకు ముఖ్యమంత్రి హాజరుకాకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా ఆయన సంతోష్ బాబు కుటుంబాన్ని స్వయంగా వెళ్లి పరామర్శించడంతో విమర్శలకు చెక్ పెట్టినట్టయింది. అందరూ అనుకున్న దాని కంటే సీఎం భారీ విరాళమిచ్చి సైనికుల పట్ల తమ చిత్తశుద్దిని చాటుకున్నారు. ఈ సాయంత్రం నల్గొండలోని విద్యానగర్లో ఉన్న సంతోష్ బాబు ఇంటికి వెళ్లిన కేసీఆర్... మొదట ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించారు. సంతోష్ బాబు మరణం కలచి వేసిందని.. ఆయన కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications