రైతుభరోసాలో కోతలతో రైతులు నష్టపోతున్నారు: హరీశ్ రావు
రాష్ట్రంలోని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. సిద్దిపేటలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను ముంచి సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో నిలదీస్తున్నారన్నారు.
రేవంత్ రెడ్డి నుంచి రాహుల్ గాంధీ వరకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని హరీశ్ రావు ఆరోపించారు. దీనిపై తాను చర్చకు సిద్ధమని సవాల్ విసిసారు. ఎకరానికి 9 వేలు ఎగబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమని ధ్వజమెత్తారు. రైతులకు, రైతు కూలీలకు రూ. 15 వేలు ఇస్తామన్న కాంగ్రెస్.. ఇప్పుడు కోతలు పెడుతోందని మండిపడ్డారు. మూడు పంటలకు రైతుబంధు ఇస్తామని చెప్పిన రేవంత్.. ఇప్పుడెందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

ఇదేనా కాంగ్రెస్ చెప్పిన రైతు రాజ్యం అని హరీశ్ రావు నిలదీశారు. కౌలు రైతుకు రైతుబంధు ఎగబెట్టినందుకు పాలాభిషేకాలు చేయాలా? అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ నాయకుల మాటలు దాటాయని.. ఇప్పుడు కోతలు పెడుతున్నారని మండిపడ్డారు. ఒక ఎకరం ఉన్నా.. అంతకంటే తక్కువగా ఉన్నా వ్యవసాయ కూలీలుగా గుర్తించాలన్నారు. వారికి 12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతు కూలీలు నష్టపోతారన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికీ చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని చెప్పారు హరీశ్ రావు. రైతు రుణమాఫీ కాని పలువురు రైతుల వివరాలను హరీశ్ రావు ఈ సందర్భంగా వెల్లడించారు. రుణమాఫీ కాకపోవడంతో పలువురు రైతులు ఆత్మహత్యలకు సిద్ధమవుతున్నారని అన్నారు. ఓ రైతు ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమవగా తానే ఆపినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసి రైతులందరికి రుణమాఫీ అందేలా చేస్తామన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే కేసులు, దాడులు చేస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications