జైపాల్! నీ చరిత్ర తెలుసు, సర్వేకు వరంగల్లో ఓటేస్తారా: విరుచుకుపడిన కర్నె
వరంగల్/హైదరాబాద్: తమ పార్టీని, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును విమర్శిస్తున్న మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి, వరంగల్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణల గురించి అందరికీ తెలుసునని టిఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ అన్నారు.
జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గురువారం కర్నె ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. జైపాల్, సర్వేలకు తమను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. వరంగల్లో తమకు ఎవరూ పోటీ లేరని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి రాజయ్యను తొలగించి, దళితులను కెసిఆర్ అవమానించారని జైపాల్ రెడ్డి చెప్పడం విడ్డూరమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఇతర నేతల పైనా కర్నె విరుచుకుపడ్డారు. కేసీఆర్ను విమర్శించే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని చెప్పారు. 50 ప్రశ్నలు సందించినట్టు రాశారు కానీ వాటిని చూస్తుంటే వారికి ప్రశ్నించడమే చేతకాదనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
ఉనికి కోసమే ప్రతిపక్షాలు కేసీఆర్ పాలనపై విమర్శలు చేస్తున్నాయన్నారు. నాడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రాంతానికి ఒక్క రూపాయి కూడా నిధులివ్వం ఏం చేసుకుంటారో చేసుకోండని అన్నపుడు ప్రశ్నించే చేతకాని ఈ కాంగ్రెస్ నేతలు ఇవాళ సీఎం కేసీఆర్ను ప్రశ్నించడం విడ్డూరమన్నారు.
స్క్రిప్టు కూడా రాయచేతగాని ఉత్తమ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడన్నారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన పుస్తకంపై మాట్లాడుతూ... షబ్బీర్ ఆలీ ఒక అబద్దాల నిఘంటువు రాశారన్నారు. వరంగల్ లోకసభలో కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ మంత్రి పదవి కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తి అన్నారు. అలాంటి అభ్యర్థికి వరంగల్ ఓటర్లు ఎలా ఓటు వేస్తారని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారో అర్థం కావట్లేదన్నారు.
ఫాంహౌజ్లో చేస్తేనే వ్యవసాయమా?: లక్ష్మణ్
వరంగల్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్కు ప్రజలు గుణపాఠం చెబుతారని బిజెపి శాసన సభా పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ప్రశ్నించేతత్వాన్ని అణిచివేస్తున్న తెరాసకు ప్రజలు అణిచివేస్తారన్నారు. పేదోళ్ల పైన ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ఫాంహౌస్లో చేస్తేనే వ్యవసాయమా అని నిలదీశారు. జిహెచ్ఎంసీ డీ లిమిటేషన్ ప్రక్రియ దారుసలాంలో జరిగితే టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.