'కాంగ్రెస్ బస్సు యాత్రలకు జనాలను తరలించాం.. కానీ డబ్బులివ్వలే?'
Recommended Video
వరంగల్: కాంగ్రెస్ బస్సు యాత్రలు జనం లేక వెలవెలబోతున్నాయని అధికార పార్టీ విమర్శిస్తుంటే.. ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోందని హస్తం పార్టీ చెప్పుకుంటోంది. నిజమే.. కాంగ్రెస్ బస్సు యాత్రలకు జనం పెద్ద ఎత్తునే తరలివస్తున్నారు. అయితే వాళ్లంతా డబ్బులిస్తేనే వస్తున్నారా?..
బయటివాళ్లు చెప్పడమెందుకు.. ఓ కాంగ్రెస్ నేతనే బహిరంగంగా ఆ విషయం బయటపెట్టారు. ఒక్కరికి రూ.200చొప్పున ఒక్కో డివిజన్ నుంచి 200మందిని సభకు తరలించానని, దయచేసి ఆ డబ్బులు ఇప్పించాల్సిందిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని వేడుకున్నాడు.
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి వరంగల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించేందుకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి ఎంజీఎం చౌరస్తా వద్దక వచ్చారు. అదే సమయంలో వరంగల్ 29వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోరెమియా అక్కడికి వచ్చాడు.
వరంగల్ తూర్పు నియోజక వర్గంలో జరిగిన కాంగ్రెస్ ప్రజా చైతన్య బస్సు యాత్ర బహిరంగ సభ కోసం తరలించిన జనాలకు డబ్బులు ఇవ్వడం లేదని అధ్యక్షుడికి మొరపెట్టుకున్నాడు. మరో కాంగ్రెస్ నాయకుడు అచ్చా విద్యాసాగర్ కూడా ఇదే వాపోయాడు.
బహిరంగ సభ కోసం తన డివిజన్ నుంచి ఒక్కొక్కరికి రూ.200చొప్పున సుమారు రెండు వందల మందిని తరలించానని, సభ అయిపోయాక డబ్బుల గురించి అడిగితే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదని వాపోయాడు.
కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. డబ్బులు అడిగేందుకు.. ఇదేనా సమయం, సందర్భం? అంటూ వారిపై మండిపడినట్టు సమాచారం.