ప్రభుత్వంపై అవిశ్వాసానికి కాంగ్రెస్ రెఢీ: బిజెపి నేతలతో జానారెడ్డి మంతనాలు
టిఆర్ఎస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని కాంగ్రెస్ శాసనసభాపక్షం ప్రకటించింది.
హైదరాబాద్: టిఆర్ఎస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని కాంగ్రెస్ శాసనసభాపక్షం ప్రకటించింది. శాసనసభలో అధికారా పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో రైతుల సమస్యలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కాంగ్రెస్ పార్టీ తప్పుబడుతోంది. ఈ విషయమై ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టనున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
ఈ మేరకు సీఎల్పీ నేత జానారెడ్డి ఈ విషయాన్ని శాసనసభలో ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడ ఇదే విషయాన్ని ప్రకటించారు.కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్పై దూకుడును పెంచాలని భావిస్తోంది.
ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. ఈ తరుణంలోనే టిఆర్ఎస్ను ఇరుకునపెట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజునే చలో అసెంబ్లీని నిర్వహించింది. రైతాంగం సమస్యలపై కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రస్తావించింది.
టిఆర్ఎస్పై అవిశ్వాసానికి కాంగ్రెస్ సన్నద్దం
రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. పత్తిరైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఏపీ, గుజరాత్, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో కనీస మద్దతుధరకు అదనంగా బోనస్ ఇచ్చి ఆదుకుంటున్నారు. తెలంగాణలో ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. గతంలో శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను విస్మరించారు. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని రైతులు ఎదురు చూస్తుండగా నష్టపరిహారం పేరే ఎత్తొద్దని సీఎం ప్రకటించారని కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తున్నారు. రైతుల సమస్యపైనే టిఆర్ఎస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టనున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
వడ్డీ చెల్లించిన రైతుల జాబితాతో సభ ముందుకు
రుణమాఫీపై ప్రభుత్వం చెబుతున్న మాటలకు,. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు మద్య తేడా ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. రుణమాఫీతో పాటు రైతులకు వడ్డీని కూడ చెల్లించామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ విషయమై రైతులు వడ్డీలు స్వయంగా చెల్లించారా, ప్రభుత్వం చెల్లించిందా అనే విషయాలపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు. వడ్డీలు చెల్లించకుండా ఉన్న రైతులకు మాఫీ చేస్తామని సీఎం ప్రకటించారు. అయితే ఈ విషయమై జాబితాను తయారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రెఢీగా ఉంది. తమ నియోజక వర్గాలు, జిల్లాల్లోని బ్యాంకు అధికారులను సంప్రదించి వివరాలు తీసుకుంటున్నారు.
బిజెపితో జానారెడ్డి మంతనాల వెనుక..
బుధవారం సభ వాయిదా పడిన అనంతరం జానారెడ్డి బీజేఎల్పీకి వెళ్లి కిషన్రెడ్డి, లక్ష్మణ్లతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు సిఎల్పీ నేత జానారెడ్డి బిజెపి నేతలతో చర్చించారని సమాచారం. ప్రభుత్వ వైఖరిలో గురువారం మార్పు వస్తుందో లేదో చూసి అవిశ్వాస తీర్మానంపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.
సభ నిర్వహణపై కాంగ్రెస్ అసంతృప్తి
శాసనసభ నిబంధనలు ఏమిటి? రాజ్యాంగం ఏం చెబుతోంది? ప్రతిపక్షాలతో పాటు ప్రధాన ప్రతిపక్షంతో ఎలా వ్యవహరించాలన్న నిబంధనలను తెలియకుండానే సభ నడుపుతున్నారని జానారెడ్డి స్పీకర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయంపై మాట్లాడేందుకు సభలో ప్రధాన ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వడం లేదన్నారు. నిరసన వ్యక్తపరిచేందుకు అవకాశం ఇవ్వాలని సభలో డిప్యూటీ స్పీకర్ను పదేపదే విజ్ఞప్తి చేసినా అవకాశమివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.