కేటీఆర్ ఫామ్హౌస్ దగ్గర రచ్చ.. వీడియో తీస్తూ రేవంత్ హల్చల్.. సంచలన ఆరోపణలు
రంగారెడ్డి జిల్లా గండిపేట చెరువుకు సమీపంలోని జన్వాడాలో మంత్రి కేటీఆర్ కు చెందినట్లు భావిస్తోన్న ఫామ్ హౌజ్ వద్ద కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశర్ రెడ్డి హల్ చల్ చేశారు. జీవో నంబర్ 111కి విరుద్ధంగా ఫామ్ హౌజులు నిర్మించిన కేటీఆర్.. మొత్తం 25 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపించారు. కారు పైకెక్కి మరీ కేటీఆర్ ఫామ్ హౌజ్ ను వీడియో తీసే ప్రయత్నం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ రేవంత్.. కేసీఆర్ కుటుంబీకులపై సంచలన ఆరోపణలు చేశారు.
''హైదరాబాద్ సిటీకి జీవాధారమైన హిమాయత్సాగర్, ఉస్మాన్ సాగర్(గండిపేట చెరువు) పరివాహాక ప్రాంతాలను బయో కన్జర్వేజన్ జోన్గా ప్రకటించారు. కబ్జా కోరల నుంచి ఈ చెరువుల్ని కాపాడుకోడానికే జీవో నెం.111ను అమల్లోకి తెచ్చారు. ఈ జీవోలోని భూముల్లో అక్రమనిర్మాణాలపై సాక్షాత్తూ హైకోర్టు చీఫ్ జస్టిసే ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి ప్రాంతంలో మంత్రి కేటీఆర్ మొత్తం 25 ఎకరాల భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడు. లోపల లక్ష స్క్వేర్ ఫీట్లతో మూడంతస్తుల రాజభవంన నిర్మించుకున్నాడు. ఇది ముమ్మాటికీ అక్రమ నిర్మాణం అనడానికి మా దగ్గర ఆధారాలున్నాయి..''అంటూ సంబంధిత ఫొటోలను రేవంత్ మీడియాకు చూపించారు.
జన్వాడ గ్రామంలో సర్వే నంబర్ 301, 302, 312, 3013 భూములు చిన్నసముద్రం చెరువు కిందికి వస్తాయని.. ఆ చెరువు అలుగుపోసిన నీళ్లు.. ఫిరంగి కాలువ ద్వారా గండిపేటకు చేరుతాయని.. అయితే కేటీఆర్ ఫామ్ హౌజుకు నీళ్ల కోసం.. ఏకంగా ఫిరంగా కాలువను దారిమళ్లించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇద్రభవనం లాంటి ఫామ్ హౌజును కట్టుకున్న కేటీఆర్.. పక్కనున్న భూముల్ని కూడా లాగేసుకునేందుకు ప్రయత్నించారని, ఆయా యజమానులను పోలీసులతో బెదిరించారని రేవంత్ తెలిపారు.
కొద్ది రోజుల కిందటే ఎంపీ రేవంత్, ఆయన సోదరుడు కొండల్ రెడ్డిపై భూఆక్రమణల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గోపనపల్లి గ్రామంలోని సర్వేనెంబర్ 34లో ఎకరా 11 గుంటలు, సర్వే నెం 126, కోమటికుంటలో ఎఫ్టీఎఫ్ బఫర్జోన్లో ఎకరా 14 గుంటల భూమిని రేవంత్ సోదరులు కబ్జా చేశారనే ఆరోపణలున్నాయి. దీనిపై తెలంగాణ సర్కారు సీరియస్ గా విచారణ చేస్తోన్న తరుణంలోనే రేవంత్.. కేటీఆర్ ఫామ్ హైజ్ అక్రమాలంటూ సంచలన విషయాలు బయటపెట్టారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు స్పందించాల్సిఉంది.