Shock to Kaushik Reddy : షోకాజ్ నోటీసులు జారీ చేసిన కాంగ్రెస్... 24 గంటల డెడ్ లైన్...
హుజురాబాద్ కాంగ్రెస్ ఇన్చార్జి కౌశిక్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు,ఫిర్యాదుల మేరకు కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 'టీఆర్ఎస్ టికెట్ నాకే...' అంటూ కౌశిక్ రెడ్డి ఆడియో లీకవడంతో కాంగ్రెస్ ఈ చర్యలకు పూనుకుంది. నోటీసులపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని... లేనిపక్షంలో తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది.
Kaushik Reddy Audio Leak : టీఆర్ఎస్ టికెట్ నాకే.. దుమారం రేపుతోన్న కౌశిక్ రెడ్డి ఆడియో లీక్...
కౌశిక్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ చాలా వేగంగా స్పందించడం గమనార్హం. ఆడియో టేపు బయటకొచ్చిన గంటల వ్యవధిలోనే ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ అవడం చర్చనీయాంశంగా మారింది. తాజా చర్యతో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడేవారిని ఎంతమాత్రం ఉపేక్షించేది లేదన్న సంకేతాలు పంపించినట్లయింది.
షోకాజ్ నోటీసులపై కౌశిక్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆయన టీఆర్ఎస్లో చేరేది నిజమే అయితే... షోకాజ్ నోటీసులపై స్పందించకపోవచ్చు. కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం కేవలం 24 గంటల డెడ్ లైన్ విధించడంతో... రేపటి లోగా కౌశిక్ రెడ్డి వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆయన కాంగ్రెస్లో కొనసాగుతారా లేక టీఆర్ఎస్లో చేరుతారా అన్నది తేలిపోవచ్చు.
Recommended Video
మరోవైపు కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ నిజంగానే టికెట్ ఖరారు చేసిందా... లేక కౌశిక్ రెడ్డి వ్యక్తిగత మైలేజ్ కోసం మైండ్ గేమ్ ఆడుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ నేత,బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్ దీనిపై స్పందించారు. కౌశిక్ రెడ్డి వ్యక్తిగతంగా చేసుకుంటున్న ప్రచారమే తప్ప ఇప్పటికైతే టీఆర్ఎస్ అధిష్ఠానం హుజురాబాద్ అభ్యర్థిని ఖరారు చేయలేదని అన్నారు. అసలు కౌశిక్ రెడ్డి పేరు అధినేత కేసీఆర్ పరిశీలనలో ఉన్నది లేనిది కూడా తెలియదన్నారు.తమకైతే ఎటువంటి సంకేతాలు లేవని స్పష్టం చేశారు.ఇటీవలే హుజురాబాద్ నియోజకవర్గంలో బైక్ ర్యాలీ చేపట్టిన కౌశిక్ రెడ్డి... తాను కాంగ్రెస్ తరుపునే పోటీ చేస్తానని ప్రకటించిన విషయాన్ని కృష్ణమోహన్ గుర్తుచేశారు.