టీపీసీసీ చీఫ్ ఖరారులో కొత్త ట్విస్ట్ - అనూహ్య ఎంపిక..!!
తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త సారధి ఖరారు కానున్నారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కొత్త పీసీసీ అధ్యక్షుడిగా ముగ్గురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అధ్యక్షుడి ఎంపికతోపాటు కేబినెట్ విస్తరణపై కూడా హైకమాండ్ వద్ద చర్చ జరిగే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కొత్త నిర్ణయాలు ఉండనున్నాయి. దీంతో, కాంగ్రెస్ ఆశావాహులు ఢిల్లీ నిర్ణయాల వైపు ఉత్కంఠగా చూస్తున్నారు.
కసరత్తు
తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎంపిక తుది కసరత్తు కొనసాగుతోంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో నేడు ఏఐసీసీ నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ ముగ్గురి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత తుది నిర్ణయం ప్రకటించనున్నారు. టీపీసీసీ నూతన అధ్యక్షుడి నియామకంలో సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. పార్టీకి ఇప్పటికే తన అభిప్రాయం స్పష్టం చేసానని..టీపీసీసీ చీఫ్ గా ఎవరిని నియిమించినా తనకు అభ్యంతరం లేదని రేవంత్ స్పష్టం చేసారు.

రేసులో నలుగురు
పీసీసీ చీఫ్ గా నలుగురి పేర్లు తుది పరిశీలనతో ఉన్నాయి. బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఎస్సీ వర్గం నుంచి విప్ అడ్లూరి లక్ష్మణ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, ఎస్టీ వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ పేర్లు ఉన్నట్టు తెలిసింది. అయితే ఇందులో ఎవరిని నియమిస్తే పార్టీకి ఉపయోగం ఉంటుందనే కోణంలో పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తోంది. పీసీసీ పదవి ఒక సామాజిక వర్గానికి ఇస్తే, త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణలో ఆ వర్గానికి మంత్రి పదవి ఉండదని హైకమాండ్ స్పష్టం చేసినట్టు తెలిసింది.
హైకమాండ్ నిర్ణయం
ఈ నిర్ణయంతో పాటుగా మంత్రివర్గ విస్తరణ పైన నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం సీఎంతో కలుపుకుని మొత్తం 12 మంది మంత్రులు ఉండగా, మరో ఆరుగురికి కేబినెట్ లో చోటు ఉంది. అయితే ప్రస్తుతం సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ముగ్గురు లేదా నలుగురిని కేబినెట్ లోకి తీసుకునే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. విస్తరణ జరిగితే ఇద్దరు రెడ్లు, ఒక ఎస్సీ, ఒక మైనార్టీకు చాన్స్ ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నారు. అదే విధంగా పెండింగ్ నామినేటెడ్ పదవులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications