పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు..
తెలంగాణ వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగుతోంది. మొత్తం 4,236 స్థానాలకు గానూ 746 స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో కాంగ్రెస్ 472 స్థానాలతో ముందంజలో ఉంది. 142 స్థానాల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక బీజేపీ 27 స్థానాల్లో విజయం సాధించింది. ఇతరులు 106 స్థానాల్లో గెలుపొందారు.
ఇక తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 3,834 గ్రామాల్లో సర్పంచ్ అలాగే 27,678 మంది వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 79.15 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 87.93 శాతం పోలింగ్ నమోదు అయింది. అలాగే మెదక్ జిల్లాలో 86 శాతం.. వరంగల్ జిల్లాలో 81.2 శాతం పోలింగ్ జరిగింది.
ఇక హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఆరేపల్లిలో సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు తీవ్ర ఉత్కంఠను రేపింది. అభ్యర్థి స్రవంతి కేవలం 4 ఓట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది. అలాగే కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం ర్యాగట్లపల్లిలో భాగ్యమ్మ అనే సర్పంచ్ అభ్యర్థి కూడా కేవలం 5 ఓట్లతో గెలుపొందింది.

అలాగే మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చీన్యా తండాలో BRS బలపరిచిన జాటోత్ హరిచంద్ 9 ఓట్లతో విజయం సాధించాడు. నల్గొండ జిల్లా మద్దిరాల మండలం తూర్పు తండాలో ఒక్క ఓటుతో విజయం సాధించాడు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి భూక్య వీరన్న ప్రత్యర్థిపై ఒక్క ఓటుతో విజయం సాధించాడు. మరోవైపు కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లెలో తల్లిపై కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి పల్లపు సుమలత ఆమె తల్లి గంగవ్వపై 91 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.












Click it and Unblock the Notifications