టిఆర్ఎస్కు షాకిచ్చిన విపక్షాలు: కాంగ్రెస్ చేతికి ఆ మున్సిపల్ ఛైర్పర్సన్ పదవి!
టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు ఎదురుదెబ్బ తగిలింది. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలో ఆ రెండు పార్టీలకు కాంగ్రెస్ తోపాటు టీడీపీ, బీజేపీలు కలిసి షాకిచ్చాయి.
హైదరాబాద్: టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు ఎదురుదెబ్బ తగిలింది. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలో ఆ రెండు పార్టీలకు కాంగ్రెస్ తోపాటు టీడీపీ, బీజేపీలు కలిసి షాకిచ్చాయి. తాండూరు మున్సిపల్ ఛైర్ పర్సన్గా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించిన విపక్షాలు ఆశ్చర్యానికి గురిచేశాయి.
వివరాల్లోకి వెళితే.. గతంలో తాండూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఆ ఎన్నికలో టీఆర్ఎస్ 10, ఎంఐఎం 10 వార్డులను గెలుచుకున్నాయి. కాంగ్రెస్ 8, టీడీపీ 2, బీజేపీ 2 చొప్పుల కౌన్సిలర్లను గెలుచుకున్నాయి. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో మిత్రపక్షాలైన టీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక అవగాహనకు వచ్చాయి. చైర్ పర్సన్ ఐదేళ్ల పదవీ కాలాన్ని చెరో రెండున్నరేళ్ల పాటు పంచుకున్నాయి.
ఆ అవగాహన మేరకు తొలుత టీఆర్ఎస్ కౌన్సిలర్ విజయలక్ష్మి మున్సిపల్ చైర్ పర్సన్గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా ఎంఐఎం కౌన్సిలర్ ఎన్నికయ్యారు. రెండున్నరేళ్ల పదవీ కాలం పూర్తి కావడంతో ముందుగా చేసుకున్న అవగాహన మేరకు చైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్లు ఇద్దరూ రాజీనామా చేశారు. దాంతో ఆ రెండు స్థానాలకు ఎన్నికలు అవసరమయ్యాయి.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం రోజున ఆ రెండు స్థానాలకు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన జిల్లా సబ్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎన్నికలు నిర్వహించారు. ముందస్తు అవగాహన మేరకు ఈసారి ఎంఐఎం అభ్యర్థి చైర్ పర్సన్గా, టీఆర్ఎస్ అభ్యర్థి వైస్ చైర్ పర్సన్ గా చేసుకోవాలని ఆ రెండు పార్టీలు నిర్ణయించాయి.
కాగా, జిల్లాకు చెందిన మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలోనే పలువురు కౌన్సిలర్లు ఆ రెండు పార్టీలకు షాకిచ్చారు. ఎన్నిక ప్రక్రియ మొదలుకాగానే ఎంఐఎం తరఫున చైర్ పర్సన్ అభ్యర్థిగా ఎవరూ నిలపడం లేదని ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్ సాజిద్ అలీ ప్రకటించడం మిత్రపక్ష నేతలు షాక్కు గురయ్యారు. ఎంఐఎంకు చెందిన 10 మంది కౌన్సిలర్లలో 6గురు కౌన్సిలర్లు తాము ఎవరినీ నిలపడం లేదని తేల్చిచెప్పారు.
ఈ పరిణామంతో షాక్ కు గురైన మంత్రి జోక్యం చేసుకుని మిత్రపక్షాలుగా మనం అభ్యర్థిని నిలపాలి కదా అన్నప్పటికీ వారు వినిపించుకోలేదు. ఆ తర్వాత టీడీపీ, బీజేపీ తరఫున కూడా ఎవరినీ ప్రతిపాదించకపోగా, కాంగ్రెస్ తమ అభ్యర్థిగా కౌన్సిలర్ సునితా సంపత్ను చైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రతిపాదించింది.
నిబంధనల మేరకు చేతులెత్తే ప్రక్రియలో సబ్ కలెక్టర్ ఎన్నిక నిర్వహించగా, సునితా సంపత్కు కాంగ్రెస్ 8 ఓట్లతో పాటు టీడీపీ 2, బీజేపీ 2, ఎంఐఎం చీలిక వర్గం నుంచి 6 గురి మద్దతు లభించింది. మొత్తం 31 మంది కౌన్సిలర్లు ఉన్న ఆ మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యేగా మంత్రి మహేందర్ రెడ్డికి కూడా ఓటు ఉంది.
మొత్తం 32 ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థికి 17 ఓట్లు రావడంతో సునితా సంపత్ విజయం సాధించినట్టు ప్రకటించారు. కాగా, ఆ తర్వాత ఎంఐఎం చీలిక వర్గం కౌన్సిలర్ ఆసిఫ్ వైఎస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఎంఐఎంలో మిగిలిపోయిన నలుగురు, టీఆర్ఎస్ కలిపి మహమ్మద్ బేగంను చైర్ పర్సన్ గా ప్రతిపాదించనప్పటికీ మంత్రి ఓటుతో కలిపి ఆమెకు 15 ఓట్లు మాత్రమే రావడంతో 2ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.