Telangana: పండుగొచ్చింది.. పైసల్ లేవు.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన..
కొద్ది నెలలుగా జీతాలు లేక తెలంగాణలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. బతుకమ్మ, దసరా పండుగల పూట చేతిలో చిల్లి గవ్వలేక అవస్థలు పడుతున్నామని వారు వాపోతున్నారు. తమకు ఇప్పటికే రెండు, మూడు నెలల నుంచి జీతం రావడం లేదని.. ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ఇప్పట్లో తమకు జీతాలు వచ్చే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు. బతుకమ్మ పండుగకు పిల్లలకు డ్రెస్సులు కొనిచ్చే పరిస్థితి కూడా లేదని వారు బాధపడుతున్నారు.
తమకు ఏదో విధంగా జీతాలు అందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. వివిధ శాఖల్లో పని చేస్తున్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది తమకు పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు. వీఆర్ఏలు గత ఏడాది 81 రోజుల పాటు సమ్మె చేశారు. దీంతో ప్రభుత్వం ఆగస్టు10న వీఆర్ఏలకు పేస్కేల్ ప్రకటించింది. వారిని పలు శాఖల్లో సర్దుబాటు చేసింది. దాదాపు 23 వేల మంది వీఆర్ఏలకు గాను14 వేల మందికి మాత్రమే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చింది.

డిగ్రీ చదివిన వారిని జూనియర్ అసిస్టెంట్లుగా, ఇంటర్ చదిన వారిని రికార్డ్అసిస్టెంట్, టెన్త్, అంతకు తక్కువ చదివిన వారిని అటెండర్లుగా నియమించింది. అయితే నియామకాల తీరును తప్పుపడ్తూ అసలు శాఖల్లోని పలువురు ఆఫీస్ సబ్ఆర్డినేట్లు కోర్టుకెక్కారు. దీంతో వీఆర్ఏలు ప్రభుత్వోద్యోగులుగా గుర్తింపు పొందినప్పటికీ కనీసం ఐడీ కార్డులు కూడా రాలేదు. రెగ్యులరైజ్ చేసే క్రమంలో కొన్ని రూల్స్, గైడ్లైన్స్ ఫాలో అవ్వాల్సి ఉండగా ఆ ప్రాసెస్ లేట్ చేశారు. దీంతో వీరి జీతాలు ఐదు నెలలుగా పెండింగ్ లో ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో రాష్ట్రంలో దాదాపు 583 మంది కళాకారులు పనిచేస్తున్న సంగతి తేలిసిందే. అయితే వీరికి సకాలంలో జీతాలు రావడం లేదని చెబుతున్నారు. వీరికి సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు. అక్టోబర్ నెల సగానికి వచ్చినా నేటికీ ఆగస్ట్, సెప్టెంబర్ జీతాలు రాలేదని వారు వాపోతున్నారు. ఇటు మిషన్ భగీరథలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలు రావడం లేదని తెలుస్తోంది. అటు ధరణి ఆపరేటర్లకు 7 నెలలుగా జీతాలు రావడం లేదు. దీంతో రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.












Click it and Unblock the Notifications