కరోనా ఎఫెక్ట్: ఏపీ-తెలంగాణ సరిహద్దు మూసివేత, వందలాది వాహనాలు రోడ్డుపైనే..
సూర్యపేట: దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అంతర్రాష్ట్రాల సరిహద్దులను మూసివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా సరిహద్ద రాష్ట్రాలతో ఉన్న మార్గాలను మూసివేస్తున్నాయి.
రోడ్లపైనే వందలాది వాహనాలు
ఈ క్రమంలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు కోదాడ మండలం రామాపురం చెక్ పోస్టును అధికారులు మూసివేశారు. దీంతో చెక్ పోస్టు వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అత్యవసర వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతించారు. దీంతో గంటల తరబడి వందలాది వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి.
పోలీసులతో వాహనదారుల వాగ్వాదం..
నాలుగైదు గంటల నుంచి పడిగాపులు గాచినా పోలీసులు అనుమతించడం లేదని పలువురు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా ఒక్కసారిగా మార్గాలను మూసివేస్తే ఎలా అని ప్రశ్నించారు. కొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకునే చర్యల్లో భాగంగానే రహదారులను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా...
తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఇప్పటి వరకు 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 97 మందిని క్వారంటైన్ ఉంచి చికిత్స అందిస్తున్నారు. 14 రోజుల అనంతరం వీరిని ఇళ్లకు పంపిస్తారు. ఇక ఏపీలో కూడా కరోనా వ్యాపిస్తోంది. ఏపీలో ఇప్పటి వరకు 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీ ప్రభుత్వం కూడా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అత్యవసర సేవలు మినహా అన్నీ బంద్ అని స్పష్టం చేసింది.
దేశంలో 8కి చేరిన మరణాలు.. ప్రపంచంలో 14వేలు..
ఇక దేశంలో 433కు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8 మరణాలు చోటు చేసుకున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా 14వేల మరణాలు చోటు చేసుకున్నాయి. సుమారు మూడున్నరలక్షల మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. సుమారు 170 దేశాలకు పైగా కరోనా బారిన పడ్డాయి. ఇటలీ, ఇరాన్, స్పెయిన్ లాంటి దేశాల్లో మరణాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. చైనా కరోనాను కట్టుదిట్టమైన చర్యలతో కట్టడి చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడం లేదు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దేశాలు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరింది.