ఏప్రిల్ 7కు కరోనా ఫ్రీ తెలంగాణ: ఆ దరిద్రులకు కరోనా సోకాలి: కేసీఆర్, ఇతర రాష్ట్రాల కూలీలకు అభయం
హైదరాబాద్: ఇప్పటివరకు తెలంగాణలో 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇప్పటి వరకు పాజిటివ్గా ఉన్న 11 కేసులు నెగిటివ్ వచ్చాయని చెప్పారు. మరోసారి పరీక్షల్లో నెగిటివ్ వస్తే వారిని డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. మిగితా పాజిటివ్ కేసుల వ్యక్తులు కూడా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం 25,937 మంది పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు.
మన దేశాన్ని మెచ్చుకుంటున్నారు
భారతదేశం చేస్తున్న లాక్డౌన్ను ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయని కేసీఆర్ తెలిపారు. మన దగ్గర కరోనాను కట్టడి చేసేందుకు లాక్డౌనే ఏకైక ఆయుధమని అన్నారు. ఈ ఆయుధం ద్వారానే మనం ఔట్ ఆఫ్ డేంజర్లో ఉన్నామని చెబుతున్నారని తెలిపారు. 130 కోట్ల జనాభా ఉన్నా సమస్యను పెరగనివ్వడం లేదని మెచ్చుకుంటున్నారని అన్నారు. ప్రజలు దయచేసి పూర్తిగా కరోనా కట్టడి అయ్యే వరకూ లాక్ డౌన్ ను కొనసాగించాలని కోరారు కేసీఆర్. ఈ వ్యాధికి మందు లేదని, స్వీయ నియంత్రణే మందు అని చెప్పారు. వైద్యులు, పోలీసులకు సహకరించాలని అన్నారు. సౌత్ కొరియాలో ఒక్కరితోనే 59వేల మందికి కరోనా సోకిందన్నారు. దేశ, రాష్ట్ర ప్రజలు మంచి సహకరిస్తున్నారని, మరింత సీరియస్గా లాక్ డౌన్ పాటించాలన్నారు. స్వీయ నియంత్రణ అవసరమన్నారు.
రైతుల వద్దకే వచ్చి పంట కొంటాం..
40లక్షల ఎకరాల వరి, 14.50లక్షల టన్నుల పంటలు సిద్ధంగా ఉన్నాయని, వాటిని ప్రభుత్వమే కొంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతులకు కూపన్లు ఇస్తామని, వాటిపై తేదీ వేస్తామని చెప్పారు. ఆ తేదీల వారిగా వచ్చి పంటను అమ్ముకోవచ్చన్నారు. ఆన్ లైన్ లోనే డబ్బులు వేస్తుందని చెప్పారు. మార్కెట్ యార్డులు బంద్ ఉంటాయని, గ్రామాలకే అధికారులు వచ్చి పంటలు కొంటారని కేసీఆర్ చెప్పారు. పట్టణాల కంటే గ్రామాల్లో ఎక్కువ క్రమశిక్షణ పాటిస్తున్నారని సీఎం అన్నారు. యుద్ధ వాతావరణంలో ఉన్నామని, రైతులు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను అందిపుచ్చుకోవాలన్నారు. గ్రామాల్లో వేసిన కంచెలు తీస్తే సరుకులు, ఇతర ప్రభుత్వ వాహనాలు వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. నిత్యావసర సరుకుల రాకపోకలకు అవకాశం ఉంటుందన్నారు. కూపన్లను ఐదు రోజుల్లోనే రైతులకు ఇస్తామని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు 3 ఫీట్ల దూరం పాటించాలన్నారు. జబ్బులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఇతర రాష్ట్రాల కూలీలకు అభయం.. 12కిలో బియ్యం, రూ. 500
ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని, ఇలాంటి పరిస్థితులు రావొద్దని అన్నారు. రాష్ట్రం, దేశం, ప్రపంచం కూడా లాక్ ఔట్ అయ్యిందన్నారు. డేంజర్ పోజిషన్లో ఉన్నామన్నారు. రోగ నిరోధక శక్తిని పెంచే సీ విటమిన్ పండ్లు సంత్రాలు, బత్తాయిలు మార్కెట్లలోకి రావాలని, ప్రజలు వాటిని తీసుకోవాలన్నారు. కనీస మద్దతు ధర కోసం రైస్ మిల్లర్లతో కూడా తాము సమావేశం నిర్వహిస్తామని సీఎం తెలిపారు. బీహార్ కూలీలను రప్పించేందుకు తాము చర్యలు తీసుకుంటామన్నారు. మన రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ. 500 ఇస్తామన్నారు. పిండి కావాలంటే కూడా ఇస్తామన్నారు. మన రాష్ట్రంలో ఎవరూ ఆకలితో ఉండరాదని అన్నారు. తెలంగాణలో ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు ఆందోళన చెందక్కర్లేదని అన్నారు.
ఆ దుర్మార్గులకు కరోనా రావాలంటూ శాపం..
కరోనా ఎలా విజృంభిస్తుందో తెలియదని, అందుకే అప్రమత్తంగా ఉండాలన్నారు. 60ఏళ్లలోపు రిటైర్డ్ డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లను తీసుకుంటామని, రిటైర్డ్ ఆర్మీ వారిని కూడా తీసుకుంటామని తెలిపారు. అవసరానికి తగినట్లుగా వారిని ఉపయోగించుకుని, వారికి డబ్బులు చెల్లిస్తామన్నారు. కరోనా వ్యాపిస్తున్న పరిస్థితుల్లో ప్రజలు నియంత్రణ పాటించాలన్నారు. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆ దొంగలు దొరుకుతారని.. భయంకరంగా శిక్షిస్తామని అన్నారు. అలాంటి దుర్మార్గులకు కరోనా సోకాలని కేసీఆర్ శపించారు. ప్రజలను హింసించడం మంచిది కాదన్నారు. తాను, వైద్యారోగ్యశాఖ మంత్రి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నామని తెలిపారు.
ఇండోనేషియా నుంచి దరిద్రులు వచ్చి..
ఇండోనేషియా నుంచి వచ్చిన దరిద్రులతో కరోనా కేసులు పెరిగాయని సీఎం అన్నారు. తెలంగాణలో కరోనాతో ఎవరూ చనిపోలేదని, అయితే, చనిపోయిన వ్యక్తికి కరోనా ఉందని తేలందన్నారు. అతడు ఢిల్లీ నుంచి వచ్చాడని తెలిపారు. అతనికి ఇతర రోగాలు ఉండటం, వృద్ధుడు కావడంతో మరణించాడని తెలిపారు. ప్రభుత్వం చెబుతున్నది కాకుండా తప్పుడు ప్రచారం ఎందుకు అని ప్రశ్నించారు. జాగ్రత్తలు తీసుకుంటాన్న కరోనా కేసులు పెరుగుతున్నాయని, అయితే, తక్కువగానే అని అన్నారు. బ్రిటన్ ప్రధాని, కెనడా ప్రధాని భార్యకు కూడా కరోనా వచ్చిందని తెలిపారు.
Recommended Video
కరోనా ఫ్రీ తెలంగాణ.. ప్రధానితో మాట్లాడాను..
ఏప్రిల్ 7లోగా కరోనా ఫ్రీ తెలంగాణ అవుతుందని కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రస్తుతం కరోనా అంతా కంట్రోల్ లోనే ఉందన్నారు. కొద్ది రోజుల్లో వారి క్వారంటైన్ టైమ్ కూడా ముగుస్తుందన్నారు. అంతా తొందరగా కరోనా నుంచి బయటపడాలని కోరుకుంటున్నానని చెప్పారు. కొత్తగూడెం డీఎస్పీ తెలంగాణతోపాటు ఆంధ్రాలో కూడా తిరిగాడని, ఆ రాష్ట్రానికి సమాచారం అందించినట్లు తెలిపారు. కొత్తగూడెంలో 200 మంది క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. ప్రధానితో కూడా తాను రెండు మూడు సార్లు మాట్లాడినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడులో సునామీ వస్తే తానే స్వయంగా స్పందించి చర్యలు తీసుకున్నానని.. దీంతో ప్రధాని తనను అభినందించారని చెప్పారు. రేషన్ బియ్యం బయోమెట్రిక్ లేకుండా కూడా పంపిణీ చేసుకోవచ్చన్నారు. అయితే, పర్యవేక్షణ ఉండాలన్నారు. లాక్ డౌన్ వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టమేనని, పెట్రోల్ టాక్స్, జీఎస్టీ, అన్ని బంద్ అయిపోయాయన్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలు, గవర్నమెంటు ఉద్యోగుల జీతాలకు కూడా కోత పడుతుందన్నారు. కేంద్రానికి కూడా నష్టమేనని అన్నారు. గొప్పవాళ్లు కరోనా కట్టడి కోసం విరాళాలు ఇస్తున్నారని తెలిపారు. ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని సీఎం కేసీఆర్ మరోసారి విజ్ఞప్తి చేశారు.