తెలంగాణలో కొత్త ఆప్షన్
తెలంగాణలో తమకు కొత్త ఆప్షన్ వచ్చిందని సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల్లో ప్రధానమంత్రి మోడీకి అవమానం జరిగిందని, ఇంత దిగజారిన ప్రధానమంత్రిని ఇంతవరకు చూడలేదని, భవిష్యత్తులో కూడా రాబోడన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టారని, లౌకిక దేశానికి ప్రధానమంత్రిగా మోడీ అనర్హుడని, భారతీయ జనతాపార్టీని చితక్కొట్టారని, దక్షిణ భారతదేశం గేట్లు మూసేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు దేశానికి దిక్సూచి లాంటివనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణలో పోటీ అనేది బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే కేంద్రీ కృతమవుతుందన్నారు. తామేమీ రాజకీయ సన్యాసం తీసుకోలేదని, తమక్కూడా సీట్లు కావాలన్నారు. కర్నాటక ఫలితాల తర్వాత కొత్త ఆప్షన్ వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాయింట్ యాక్షన్ లోకి రావడంలేదని, కొన్నిరోజులు చూస్తామని, ఆ తర్వాత ఆప్షన్ ను ఎంపిక చేసుకుంటామన్నారు. తెలంగాణలో పొత్తులపై జాతీయ కార్యర్వగంలో చర్చిస్తామని, కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై కచ్చితంగా ఉంటుందన్నారు.

కర్ణాటక ఫలితాలతో తెలంగాణ రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. కర్ణాటకలో భారీ విజయాన్ని సాధించడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు, క్యాడర్లో కొత్త ఉత్సాహం వచ్చింది. కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణ రాజకీయాలపై కొంత ప్రభావం చూపుతుందని వస్తున్న వార్తలతో రాజకీయ దుమారం రేగుతోంది. మొత్తం 224 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 135, బీజేపీ 66, జేడీఎస్ 19, ఇతరులు నాలుగు స్థానాలు దక్కించుకున్నారు. తెలంగాణలో కూడా బీజేపీ ఏమాత్రం పోటీ ఇవ్వలేదని, ఇప్పటికీ ఆ పార్టీకి పట్టుమని పది మంది అభ్యర్థులు కూడా లేరని, భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ మధ్యే ప్రధాన పోరు నెలకొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications