మృతదేహాలు కావలెను..

తెలంగాణలోని నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రస్తుతం 600 మందికి పైగా విద్యార్థులు ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తున్నారు. వైద్య విద్యలో అత్యంత కీలకమైన అనాటమీ విభాగం ద్వారా విద్యార్థులకు మానవ శరీర నిర్మాణం.. అవయవాల పని తీరు, కణజాల వ్యవస్థలపై ప్రాక్టికల్ అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఈ బోధనలో మానవ మృతదేహాల పాత్ర ఎంతో కీలకమైనది. పుస్తకాల ద్వారా నేర్చుకునే జ్ఞానం కంటే ప్రత్యక్షంగా మృతదేహాలపై అధ్యయనం చేయడం ద్వారా విద్యార్థులకు మెరుగైన అనుభవం లభిస్తుంది.

అయితే ప్రస్తుతం నల్గొండ మెడికల్ కాలేజీలో మృతదేహాల తీవ్ర కొరత నెలకొనడం ఆందోళనకు గురిచేస్తోంది. కళాశాల అవసరాలకు కనీసం 20 నుంచి 25 మృతదేహాలు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం కేవలం ఆరు మృతదేహాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో విద్యార్థులకు పూర్తి స్థాయి ప్రాక్టికల్ శిక్షణ అందించడం కష్టంగా మారిందని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

dead-body-shortage-in-medical-college-at-nalgonda-on-telangana-affects-anatomy-education-at-medical

వైద్య విద్యలో అనాటమీ విభాగం అత్యంత ప్రాధాన్యమైనదిగా భావిస్తారు. మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులు మానవ శరీర నిర్మాణంపై పూర్తి అవగాహన పొందాల్సి ఉంటుంది. భవిష్యత్తులో వైద్యులుగా మారే వారికి ఈ ప్రాక్టికల్ శిక్షణ బలమైన పునాది వంటిది. అందుకే మృతదేహాల లభ్యత ప్రతి మెడికల్ కాలేజీకి అత్యవసర అంశంగా ఉంటుంది. నిబంధనల ప్రకారం, గుర్తు తెలియని మృతదేహాలు పోస్టుమార్టం అనంతరం 72 గంటల పాటు ఎవరూ క్లెయిమ్ చేయకపోతే వాటిని వైద్య కళాశాలలకు అప్పగించే అవకాశం ఉంటుంది.

ప్రభుత్వం నియమించిన 13 మంది సభ్యుల కమిటీ అనుమతితో ఆ మృతదేహాలను విద్యార్థుల బోధన కోసం భద్రపరుస్తారు. ఒక మృతదేహాన్ని ప్రత్యేక రసాయనాలతో సుమారు ఏడాది పాటు భద్రపరిచి విద్యార్థుల అధ్యయనానికి ఉపయోగిస్తారు. కానీ, జిల్లాలో గుర్తు తెలియని మృతదేహాలను నిబంధనల ప్రకారం వైద్య కళాశాలకు అప్పగించకుండా, మున్సిపల్ సిబ్బంది లేదా స్వచ్ఛంద సంస్థల ద్వారా నేరుగా ఖననం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో పోస్టుమార్టం ప్రక్రియ పూర్తికాకముందే మృతదేహాలను బయటకు పంపుతున్నట్లు కూడా సమాచారం.

దీంతో మెడికల్ కాలేజీలకు అవసరమైన మృతదేహాలు అందకుండా పోతున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కళాశాలకు లభిస్తున్న మృతదేహాలలో ఎక్కువ శాతం స్వచ్ఛంద దేహదానాలే ఉండటం గమనార్హం. మరణానంతరం తమ దేహాన్ని వైద్య విద్య కోసం దానం చేయడానికి కొంతమంది ముందుకు వస్తున్నప్పటికీ, అది సరిపడడం లేదు. ప్రజల్లో దేహదానం పట్ల ఇంకా పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, అవయవ దానం ఎంత ముఖ్యమో దేహదానం కూడా అంతే ముఖ్యమైనది. ఒక మృతదేహం ద్వారా వందలాది మంది విద్యార్థులు మానవ శరీర నిర్మాణంపై ప్రత్యక్ష జ్ఞానం పొందగలుగుతారు. తద్వారా భవిష్యత్తులో మెరుగైన వైద్య సేవలు అందించే నైపుణ్యం పెరుగుతుంది. ఈ పరిస్థితిపై ఫోరెన్సిక్ విభాగం అధికారి డాక్టర్ వెంకట నాగరాజు స్పందిస్తూ, "మెడికల్ విద్యార్థులకు సరిపడా మృతదేహాలు లేకపోవడం నిజమే. విద్యార్థుల ప్రాక్టికల్ శిక్షణకు ఇవి అత్యంత అవసరం. నిబంధనల ప్రకారం అవసరాలకు సరిపడా మృతదేహాలు ఉన్నప్పుడే వాటిని బయటకు అప్పగించాలి," అని తెలిపారు.

అంతేకాకుండా, సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ఆసుపత్రుల అవుట్‌పోస్టుల వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించి, దేహదానంపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రజలు స్వచ్ఛందంగా దేహదానం చేయడానికి ముందుకు వస్తే వైద్య విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+