సుల్తాన్ బజార్ మెట్రో ఉత్కంఠకు తెర: 'పాత అలైన్మెంట్ ప్రకారమే మెట్రో రైలు'
హైదరాబాద్: సుల్తాన్ బజార్లో పాత అలైన్మెంట్ ప్రకారం మెట్రో రైలు నిర్మిస్తే తామంతా ఉపాధి కోల్పోతామని, దాంతో పాత అలైన్మెంట్ను రద్దు చేయాలని కోరుతూ సుల్తాన్ బజార్ వ్యాపారులు శనివారం మెట్రో రైలు భవన్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
పాత అలైన్మెంట్ ప్రకారమే సుల్తాన్బజార్లో మెట్రో రైలు పనులు చేపట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో పాత పద్ధతిలోనే మెట్రో రైలు నిర్మాణం జరగనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎదుట కూడా పాత అలైన్మెంట్ ప్రకారమే మెట్రో పనులు జరుగుతాయని ఆయన వెల్లడించారు.
పాత అలైన్మెంట్ కంటే కొత్త అలైన్మెంట్తో ఎంతో ఎక్కువ నష్టమని గమనించామని ఆయన తెలిపారు. పాత అలైన్మెంట్లోనే సుల్తాన్ బజార్, జైన్ మందిర్, ఆర్య సమాజ్లకు ఎలాంటి నష్టం ఉండదని ఆయన చెప్పారు. సుల్తాన్ బజార్ వ్యాపారుల కోసం 2వేల గజాల్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు.

సుల్తాన్ మెట్రో స్టేషన్ను ప్రత్యేకంగా హ్యాకర్స్ ప్యారడైజ్, నైట్ బజార్గా మారుస్తామన్నారు. బాధితులు ఎవరైనా ఉంటే తనని నేరుగా కలవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఉప్పల్ నుంచి యాదాద్రి వరకు హైస్పీడ్ మెట్రో రైల్ నిర్మాణం చేపడతామని ఈ ప్రణాళిక తయారు చేయమని సీఎం కేసీఆర్ సూచించారని తెలిపారు.
ఇందుకోసం ఎకరా స్థలం కూడా తీసుకున్నట్లు వివరించారు. నిజానికి సుల్తాన్బజార్ ప్రాంతాన్ని మినహాయించేందుకు అక్కడ అండర్గ్రౌండ్ సహా పలు రకాల ప్రత్యామ్నాయాలు చూశారు. కానీ అవేమీ ఉపయోగకరంగా లేకపోవడంతో పాత పద్ధతిలోనే మెట్రో రైలు నిర్మాణాన్ని నిర్మించాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగానే గురువారం పుత్లిబౌలిలోని పెట్రోలు బంకును కూడా కూల్చేశారు. ఏది ఏమైనప్పటికీ 2016లో మెట్రో రైలు హైదరాబాద్లో పరుగులు తీస్తుందని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications