ఏ బెయిల్ కావాలో తేల్చుకోండి: కవితకు సూచించిన కోర్టు
Kalvakuntla Kavitha: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత విచారణను ఎదుర్కొంటోన్నారు. ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల కస్టడీలో ఉన్నారు.
నిజానికి- కవిత కస్టడీ ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగాల్సి ఉంది. 9వ తేదీ వరకు ఆమెను ఈడీ అధికారుల కస్టడీకి తరలిస్తూ కిందటి నెల 26వ తేదీన ఢిల్లీలోని రోస్ అవెన్యూ న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని, మరింత సమాచారాన్ని కవిత నుంచి రాబట్టుకోవాల్సి ఉందంటూ ఈడీ తరఫు న్యాయవాది చేసిన వాదనలతో ఏకీభవిస్తూ ఆ ఆదేశాలు ఇచ్చింది.

ఆమె బెయిల్ పిటీషన్పై ఈ మధ్యాహ్నం వాదనలను ఆలకించింది ఢిల్లీ రోస్ అవెన్యూ కోర్టు. తన కుమారుడి పరీక్షలు ఉన్నాయని, తల్లిగా తోడుగా నిలవాల్సిన అవసరం ఉందంటూ ఆమె మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా.. దాన్ని విచారణకు స్వీకరించింది.
ఈ సందర్భంగా కవిత తరఫు అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలను వినిపించారు. మధ్యంతర బెయిల్తో పాటు రెగ్యులర్ బెయిల్ను కూడా మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఇన్ని రోజులపాటు చేపట్టిన విచారణల సందర్భంగా కవిత నుంచి ఎలాంటి సమాచారాన్ని కూడా ఈడీ రాబట్టుకోలేకపోయిందని, ఈ కేసు కుట్రపూరితమైనదనీ చెప్పారు.
అనంతరం న్యాయమూర్తి మాట్లాడారు. కవితకు ఎలాంటి బెయిల్ మంజూరు చేయాలనేది మొదట తేల్చుకోవాలని అభిషేక్ మను సింఘ్వీకి సూచించారు. ఆమెకు మధ్యంతర బెయిల్ కావాలా? లేక రెగ్యులర్ బెయిల్ కోసం వాదిస్తున్నారా? అనేది స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం ఈ పిటీషన్పై విచారణను ఈ నెల 4వ తేదీకి వాయిదా వేశారు.
ఇదే కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్టయిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం ఈడీ అధికారుల కస్టడీలో ఉంటోన్నారు. విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ ఉదయమే ఢిల్లీ కోర్టు ఆయన జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఈ నెల 15వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.












Click it and Unblock the Notifications