తెలంగాణలో కొత్త పొత్తులు - అనూహ్య మలుపు..!?
తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీలో జోష్ పెరిగింది. బీఆర్ఎస్ అప్రమత్తం అయింది. కాంగ్రెస్ నేతల్లో అంతర్మధనం మొద లైంది. దీంతో, తెలంగాణలో పట్టు పెంచుకోవటం పైన పార్టీలు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ఇదే సమయంలో రాజకీయంగా కొత్త కూటమి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఈ కూటమి బలం పరీక్షించుకుంటూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కు సమాయత్తం అయ్యేలా ఢిల్లీ కేంద్రంగా ఆపరేషన్ మొదలైంది.
మారుతున్న లెక్కలు
తెలంగాణలో ఎమ్మెల్సీ ఫలితాలు కొత్త లెక్కలకు కారణమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ రెండు ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కోల్పోయింది. బీజేపీ రెండు సీట్లు గెలవటం తో ఉత్తర తెలంగాణలో తమ పట్టుకొనసాగించేలా వ్యూహాలు సిద్దం చేస్తోంది. తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ సీట్లు గెలవటం పైన ప్రధాని మోదీ సైతం స్పందించారు. గెలిచిన వారిని ప్రధాని మోదీ అభినందించారు. తాజా ఫలితాల పైన సీఎం రేవంత్ మంత్రులతో సమీక్ష చేసారు. సమన్వయం లేని కారణంగానే ఓడిపోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీ పూర్తి సమన్వయంతో బలం పెంచుకునేలా క్షేత్ర స్థాయిలో పని చేయాలని నిర్ణయించారు.

కొత్త పొత్తులు
ఇటు ప్రతిపక్ష నేత కేసీఆర్ తిరిగి ప్రజల్లోకి రావాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారని చెబుతున్నారు. భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. బీఆర్ఎస్ - బీజేపీ మధ్య అవగాహన ఉందనే ప్రచారం సాగుతోంది. దీనిని తిప్పి కొడుతూ..పూర్వ వైభవం కోసం కేసీఆర్ కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఎన్డీఏను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధాని మోదీ దక్షిణాది రాష్ట్రాల పైన ప్రత్యేక వ్యూహాలకు కసరత్తు చేస్తున్నారు. ఏపీలో సక్సెస్ అయిన కూటమి పొత్తులు ఇప్పుడు తెలంగాణకూ విస్తరించే ఆలోచనలో బీజేపీ నాయకత్వం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అమరావతి పర్యటనకు వచ్చిన సమయం లోనే ఈ ప్రతిపాదన పైన చంద్రబాబు వద్ద చర్చ జరిగినట్లు సమాచారం.
ఢిల్లీ కేంద్రంగా
తెలంగాణలోనూ 2024 లోక్ సభ ఎన్నికల సమయంలోనూ టీడీపీ, జనసేనతో కలిసి ఎన్డీఏ కూటమి గా పోటీ చేయాలనే ఆలోచన జరిగింది. అప్పుడు బీజేపీ రాష్ట్ర నేతలు అంగీకరించలేదు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది పార్లమెంట్ స్థానాలు దక్కిచుకుంది. క్రమంగా రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న సీట్లతో బీఆర్ఎస్ కు నష్టం తప్పదనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దశలో ఏపీలో తరహాలోనే తెలంగాణలోనూ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా పోటీ చేసే అంశం తెర మీద కు వచ్చింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లోనూ కూటమి గా పోటీ చేసే ఆలోచన పైన కసరత్తు జరుగుతోంది. ఈ కూటమి ఏర్పాటు అధికారికం అయితే, రాష్ట్రం లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతాయనే అంచనాలు ఉన్నాయి. దీంతో, ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా చోటు చేసుకుంటున్న పరిణామాల పైన ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications