దేవాదుల ప్రాజెక్టు 2026 నాటికి పూర్తి: కేసీఆర్ టార్గెట్గా ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
దేవాల ప్రాజెక్టును 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సోనియా గాంధీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తామన్నారు. ఇరిగేషన్ శాఖను అడ్డుపెట్టుకొని మాజీ సీఎం కేసీఆర్ దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. ప్రతి ప్రాజెక్టులో వేల కోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు.
ములుగు జిల్లా దేవాదుల ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క పరిశీలించారు. ఈ సమావేశం దాదాపు మూడు గంటల పాటు సాగింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులపై కోట్ల ఖర్చు పెట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రూ.14 వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉంచారని చెప్పారు.

కమీషన్ల కక్కుర్తి కొరకు ప్రాజెక్టులు కట్టారని కేసీఆర్పై ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం, పాలమూరు, దేవాదుల, సీతారామ అన్నిట్లో గత ప్రభుత్వం దోపిడి కనిపిస్తోందని ఆరోపించారు. తెలంగాణ గ్రామీణ ముఖ చిత్రం మార్చడం కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ బిల్లులు త్వరలో చెల్లిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ధరలు పెరడంతో భూసేకరణ ఇబ్బందిగా మారిందని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. నిర్దేశిత గడుపులోపు దేవాదుల పూర్తి చేసి, 5.57 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తామన్నారు. సమ్మక్క బ్యారేజీ కట్టడం వల్ల దేవాదుల ద్వారా 300 రోజులు 60 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేస్తామని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేసీఆర్కు అవగాహన లేకుండా తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. వాటన్నంటినీ తమ ప్రభుత్వం సరి చేసుకుంటూ వస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.












Click it and Unblock the Notifications